1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Tihar Jail to conduct dummy execution of Nirbhaya convicts before Jan 22

తీహార్ జైలులో ఉరితీత ట్రయల్... మీరట్ నుంచి వచ్చిన తలారి

Nirbhaya Case
నిర్భయ కేసులోని దోషులకు ఈనెల 22వ తేదీన ఉరిశిక్షను అమలుచేయనున్నారు. ఇందుకోసం తీహార్ జైలులో ఉరితీత ట్రయల్ కూడా నిర్వహించనున్నారు. పైగా, ఈ దోషులను ఉరితీసేందుకు మీరట్ జైలు నుంచి తలారిని కూడా ఢిల్లీకి పిలిపించారు. దీంతో ఈనెల 22వ తేదీ ఉదయం 7 గంటలకు నలుగురు ముద్దాయిలకు ఉరిశిక్షలను ఏకకాలంలో అమలు చేయడం తథ్యంగా తెలుస్తోంది. 
 
కాగా, గత 2012 సంవత్సరంలో డిసెంబరు నెల 16వ తేదీన రాత్రి దేశ రాజధాని ఢిల్లీలో కదిలే బస్సులో నిర్భయ అనే పారామెడికల్ విద్యార్థినిపై ఓ రాక్షస మూక అత్యంత పాశవికంగా ప్రవర్తించి అత్యాచారం చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత బాధితురాలు రెండు వారాల పాటు చికిత్స పొంది ప్రాణాలు విడిచింది. 
 
ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేయగా, వీరిలో ఒకరు మైనర్ బాలుడు కావడంతో అతన్ని వదిలివేశారు. ఆ తర్వాత మరో నిందితుడు జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మిగిలిన నలుగురు నిందితులకు ఉరిశిక్షలను అమలు చేయనున్నారు. ఈనేపథ్యంలో ఈ నలుగురు దోషుల్ని జనవరి 22న ఉదయం 7 గంటలకు ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు మంగళవారం డెత్‌ వారెంట్‌ జారీ చేసింది. 
 
తీహార్‌ జైల్లోని మూడో నంబర్‌ జైల్లో నిందితులకు ఉరిశిక్ష అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రెండు, మూడు రోజుల్లో తీహార్‌ జైలు అధికారులు ఉరిశిక్షకు ట్రయల్స్‌ నిర్వహించనున్నారు. మూడో నంబర్‌ జైల్లోని ఉరిశిక్ష ట్రయల్స్‌ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఈ ట్రయల్స్‌ నిర్వహించే సమయంలో పీడబ్ల్యూడీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌, సూపరింటెండెంట్‌తో పాటు జైలు అధికారులు ఉండనున్నారు.
 
ఇదిలావుండగా, నిర్భయ దోషుల్ని ఉరి తీసేందుకు ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మీరట్‌కు చెందిన తలారిని సంప్రదిస్తున్నట్టు జైలు అధికారులు తెలిపారు. అలాగే, బీహార్‌లోని బక్సర్‌ జైలు నుంచి మనీలా ఉరి తాళ్లని కూడా తెప్పిస్తున్నట్టు వాళ్లు పేర్కొన్నారు. 
About Writer
శ్రీ