శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 14 డిశెంబరు 2019 (14:43 IST)

నిర్భయ దోషుల ఉరి అమలును ప్రత్యక్ష ప్రసారం చేయాలి : సుప్రీంలో పిల్

నిర్భయ అత్యాచార కేసులో దోషులకు అమలు చేసే ఉరిశిక్షలను ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. అంతేకాకుండా, అమెరికాలో ఉన్న తరహాలోనే ఈ కామాంధులను మృతురాలు నిర్భయ తల్లిదండ్రుల సమక్షంలోనే ఉరితీయాలని పిటిషనర్ కోరారు. 
 
కాగా, నిర్భయ కేసు దోషుల ఉరిశిక్షకు కౌంట్‌‌డౌన్ మొదలైంది. అధికారుల నుంచి ఫలానా రోజు ఉరి తీస్తున్నామని అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ తలారి కోసం వెతుకులాట, ఉరి తాళ్లను సిద్దం చెయ్యడం వంటి పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వారిని త్వరలోనే మరణ శిక్ష ఖాయమనే ప్రచారం రోజురోజుకూ సాగుతోంది. 
 
కాకపోతే ఉరిని అమలు చేసే విషయంలో మరికొన్ని రోజులు జాప్యం జరిగేలా కనిపిస్తుంది. దోషిగా నిర్థారించబడిన అక్షయ్, ఉరిశిక్షపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 17వ తేదీన ఈ పిల్‌పై వాదనలు జరగనున్నాయి. మిగిలిన ముగ్గురు దోషులు.. పవన్ గుప్తా, ముకేశ్, వినయ్ శర్మ గతంలోనే రివ్యూ పిల్స్ దాఖలు చేయగా వాటిని సుప్రీంకోర్టు తిరస్కరించిన విషయం తెల్సిందే.