శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : బుధవారం, 18 డిశెంబరు 2019 (15:02 IST)

నిర్భయ కేసు: దోషి అక్షయ్ రివ్యూ పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు

నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసు దోషుల్లో ఒకరైన అక్షయ్ రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. బుధవారం ఉదయం సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల ధర్మాసనం అక్షయ్ కుమార్ సింగ్ పిటిషన్‌పై విచారణ జరిపింది. సుప్రీంకోర్టులో జస్టిస్ ఆర్.భానుమతి నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన ఈ బెంచ్‌లో జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఏఎస్ బోపన్న ఉన్నారు.

 
విచారణ సమయంలో రెండు పక్షాల న్యాయవాదులు తమ తమ వాదనలు వినిపించడానికి న్యాయస్థానం ఇద్దరికి చెరో 30 నిమిషాల సమయం ఇచ్చింది.

 
కోర్టులో వాదనలు
అక్షయ్ కుమార్ సింగ్ తరపు న్యాయవాది డాక్టర్ ఏపీ సింగ్ కోర్టులో మొత్తం పిటిషన్ చదివి వినిపించారు. "నిర్భయ స్నేహితుడు డబ్బులు తీసుకుని టీవీలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు, అందుకే ఈ కేసులో ప్రధాన సాక్షి ప్రకటనలను నమ్మలేము" అని ఆయన అన్నారు. ఆ తర్వాత ఆయన ఒక మాజీ జైలర్ పుస్తకంలో ఉన్న కొన్ని వాస్తవాల గురించి వాదించారు.

 
అక్షయ్ పేదవాడని కూడా ఆయన కోర్టులో వాదించారు. దానితోపాటు దోషికి మారడానికి ఒక అవకాశం లభించాలన్నారు. "ఉరిశిక్ష వేసి నేరస్థులను అంతం చేయవచ్చు, కానీ నేరాలను అంతం చేయలేం" అని వకీల్ ఏపీ సింగ్ అన్నారు. అందుకే అక్షయ్ ఉరిశిక్షను నిలుపుదల చేయాలన్నారు.

 
సుప్రీంకోర్టులో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా "ఉరిశిక్ష విధించడానికి ఇది తగిన కేసు" అని చెప్పారు. ఇది 'రేరెస్ట్ ఆఫ్ ద రేర్' కేసుల్లోకి వస్తుందన్న ఆయన.. దోషి వైపు నుంచి కోర్టులో ఎన్నో రకాల వాదనలు వినిపించి, ఉరిశిక్ష సమయాన్ని దాటవేయాలని ప్రయత్నిస్తున్నారని చెప్పారు. అక్షయ్ మీద ఎలాంటి సానుభూతీ చూపించాల్సిన అవసరం లేదని తుషార్ మెహతా అన్నారు.
మంగళవారం జరిగిన విచారణలో దోషి అక్షయ్ కుమార్ సింగ్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది సింగ్ ప్రజా, రాజకీయ ఒత్తిళ్ల వల్లే తన క్లైంటును దోషిగా నిర్ధారించారని, ఇప్పుడు రాజకీయ లబ్ధి పొందడానికే అతడిని ఉరితీయాలని తొందరపడుతున్నారని వాదించారు.

 
అక్షయ్ కుమార్ సింగ్ నేరం?
బిహార్‌కు చెందిన 34 ఏళ్ల అక్షయ్ బస్ హెల్పర్‌గా పనిచేసేవాడు. ఇతడు బిహార్‌కు చెందినవాడు. అక్షయ్‌ను నిర్భయ ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత 2012 డిసెంబర్ 21న బిహార్‌లో అరెస్ట్ చేశారు. అక్షయ్‌ మీద హత్య, కిడ్నాప్, సాక్ష్యాలు చెరిపేసేందుకు ప్రయత్నించాడనే ఆరోపణలు ఉన్నాయి. అక్షయ్ ఆ ఏడాది బిహార్ నుంచి దిల్లీ వచ్చాడు. వినయ్ లాగే అతడు కూడా ఆరోజు తను అసలు బస్సులో లేనని చెప్పాడు.