మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్

వెనక్కి తగ్గని కార్మికులు : తెలంగాణాలో సాగుతున్న సమ్మె

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల సమ్మె కొనసాగుతోంది. ఈ సమ్మెను తక్షణం విరమించి విధుల్లో చేరాలని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినా కార్మికులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఫలితంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. 
 
సమ్మె చట్టవిరుద్దమని.. శనివారం సాయంత్రం ఆరు గంటలలోపు ఎవరైతే విధుల్లో చేరని కార్మికులు ఇక నుంచి ఆర్టీసీ ఉద్యోగులు కారని.. తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసినా.. కార్మికులు మాత్రం.. సమ్మెను కొనసాగిస్తున్నారు. విధుల్లో చేరేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. కేవలం 160 మంది ఎంప్లాయిస్‌ మాత్రమే విధుల్లో చేరారు.
 
సీఎం కేసీఆర్‌ మాటను కూడా ఖాతరు చేయలేదు కదా, మంత్రులు వార్నింగ్‌ ఇచ్చిన తర్వాత.. కార్మికులు ఇలా చేయడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరో పక్క.. ఆర్టీసీ కార్మికులకు.. ఏపీఎస్ ఆర్టీసీ కూడా మద్దతు వ్యక్తం చేసింది. న్యాయమైన డిమాండ్ల సాధనకు యాజమాన్యం, ప్రభుత్వం స్పందించకపోవడంతో.. టీఎస్ఆర్టీసీ కార్మికులు విధిలేని పరిస్థితుల్లో సమ్మెకు దిగారని.. ఏపీ ఎంప్లాయిస్ యూనియన్, ఎస్‌డబ్ల్యూఎఫ్ వేర్వురు ప్రకటనల్లో పేర్కొన్నాయి. 
 
మరోవైపు, ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి, డీజీపీ మహేందర్ రెడ్డి, రవాణాశాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఆర్టీసీ సమ్మె, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సీఎం సమీక్ష చేపట్టనున్నారు.