శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : గురువారం, 19 సెప్టెంబరు 2019 (09:32 IST)

తితిదే బోర్డులో తెలంగాణకు పెద్దపీట.. కేసీఆర్‌కు సీఎం జగన్ దాసోహమా?

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ధర్మకర్తల మండలికి కొత్త సభ్యులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. మొత్తం 24 మందితో ఈ కొత్త పాలకమండలిని ఏర్పాటుచేసింది. అయితే, ఇందులో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిలో ఏకంగా ఏడుగురికి చోటుకల్పించి పెద్దపీట వేసింది. 
 
అలాగే, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎనిమిది, తమిళనాడు నుంచి నలుగురు, కర్ణాటక నుంచి ముగ్గురు, ఢిల్లీ, మహారాష్ట్ర నుంచి ఒక్కొక్కరికి ఏపీ సర్కారు టీటీడీ పాలకమండలిలో చోటు కల్పించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వి.ప్రశాంతి, ఎమ్మెల్యేలు యు.వి.రమణమూర్తి, గొల్ల బాబూరావు, మల్లికార్జున్‌ రెడ్డి, కె.పార్థసారథి, నాదెండ్ల సుబ్బారావు, డి.పి.అనిత, చిప్పగారి ప్రసాద్‌ కుమార్‌కు అవకాశం కల్పించింది. 
 
తమిళనాడు నుంచి కృష్ణమూర్తి వైద్యనాథన్, ఎస్.శ్రీనివాసన్, డాక్టర్ నిచిత ముప్పవరపు, కుమారగురు, ఢిల్లీ నుంచి ఎం.ఎస్.శివశంకరన్, మహారాష్ట్ర నుంచి రాజేశ్‌ శర్మ, కర్ణాటక నుంచి రమేశ్‌ శెట్టి, సంపత్ రవినారాయణ, సుధా నారాయణమూర్తికి అవకాశం కల్పించారు. ఎక్స్‌అఫీషియో సభ్యులుగా తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ చైర్మన్, రెవెన్యూశాఖ ప్రత్యేక కార్యదర్శి (ఎండోమెంట్), దేవాదాయశాఖ కమిషనర్, టీటీడీ ఈవో ఉంటారు.
 
అయితే, తెలంగాణా ప్రాంతం నుంచి చోటు కల్పించిన వారిలో జూపల్లి రామేశ్వరరావు, దీవకొండ దామోదర్ రావు, బి.పార్థసారథి రెడ్డి, మూరంశెట్టి రాములు, కొలిశెట్టి శివకుమార్, పుత్తా ప్రతాపరెడ్డి, జి.వెంకట భాస్కర్ రావులు ఉన్నారు. 
 
నిజానికి తెలంగాణ రాష్ట్రలో తెరాస అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏపీలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వారిద్దరూ పాము, ముంగిసలా ఉన్నారు. కానీ గత ఎన్నికల్లో చంద్రబాబు స్థానంలో ముఖ్యమంత్రిగా వైఎస్.జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత నెలకొంది. 
 
విభజన చట్టం మేరకు ఆస్తుల పంపకాలు, ఉద్యోగుల విభజన, నీటి ప్రాజెక్టులు తదితర అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు మంచి సఖ్యతతో ముందుకుసాగుతున్నారు. దీంతో సీఎం జగన్‌ తీరును పలువురు తప్పుబట్టారు. ఇపుడు తితిదే బోర్డులో ఏకంగా ఏడుగురుకి చోటు కల్పించి పెద్ద పీట వేయడం మరో చర్చకు దారితీసింది.