1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 జనవరి 2020 (11:06 IST)

"కమల సేన" - వైసీపీ చెక్ పెట్టేందుకు జనసేనను దువ్వుతున్న బీజేపీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. గత ఎన్నికల్లో వేర్వేరుదారుల్లో పయనించిన భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కలిసి ముందుకుసాగనున్నాయి. ఇందులోభాగంగా గురువారం తొలి అడుగుపడింది. ఈ రెండు పార్టీలకు చెందిన కీలక నేతలు గురువారం విజయవాడలో భేటీకానున్నారు. 
 
ఈ భేటీలో బీజేపీ తరపున ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, కేంద్ర ప్రతినిధులు సునీల్ డియోరా, జీవీఎల్ నరసింహారావు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి, సోము వీర్రాజులు హాజరుకాగా, జనసేన పార్టీ తరపున పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్, సీనియర్ నేత నాదెండ్ల మనోహర్‌లు పాల్గొంటున్నారు. 
 
ఈ సమాశంలో రాజధాని అమరావతి అంశంతోపాటు రాష్ట్రంలోని వివిధ రకాల ప్రజా సమస్యలపై చర్చించి ఒక ఉమ్మడి కార్యాచరణను ప్రకటించనున్నారు. ముఖ్యంగా, రాజధాని తరలింపును బీజేపీతో పాటు జనసేన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ అంశంపై ఇరు పార్టీల నేతలు కలిసి పోరాటం చేయనున్నారు. దీంతో రాజధాని అమరావతి అంశం మరింత ఉధృతంకానుంది. 
 
అలాగే, వచ్చే నాలుగేళ్ళలో చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలతో పాటు.. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, ఈ ఎన్నికల్లో కలిసిపోటీ చేసే అంశం తదితర అంశాలపై ఇందులో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా, రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వ పరిపాలన, ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి తదితర అంశాలపై ఇందులో చర్చించనున్నారు.