1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 15 మార్చి 2022 (20:58 IST)

ఎవరినైనా మంత్రి పదవి నుంచి తప్పిస్తున్నానంటే అర్థం అదే: వైసీఎల్పీ భేటీలో జగన్

మంగళవారం నాడు జరిగిన వైసిఎల్పీ భేటీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని విషయాలను ఎమ్మెల్యేలు, మంత్రులతో కూలంకషంగా మాట్లాడారు. మంత్రి పదవుల నుంచి ఇపుడు తప్పిస్తున్నామంటే వారిపై మరింత బాధ్యత పెడుతున్నట్లు, అంతేకాని మంత్రివర్గంలో నుంచి పక్కనపెడుతున్నట్టుకాదు అన్నారు.

 
వచ్చే ఎన్నికల్లో మనం విజయం సాధించాలంటే డోర్ టు డోర్ వెళ్లక తప్పదన్నారు. ఎన్నికల వేళ మనం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం. కనుక చిరునవ్వుతో, ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్లగలుగుతాం. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా మనం ప్రజల వద్దకు, ప్రజలు మన వద్దకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇపుడు కాస్త పరిస్థితి మారింది.

 
మనం ప్రజల వద్దకు వెళ్లాలి. మనం చేసిన పనులను చేయబోయే పనులను వివరించాలి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాలకు అధ్యక్షులను, ఇంచార్జిలను, కో-ఆర్డినేటర్లను నియమిస్తాం. గెలిచేందుకు తలాఒక చేయి వేసి పార్టీకోసం మరింత కష్టపడదాం.

 
మంత్రులుగా చేసినవారు ఇపుడు పార్టీ బాధ్యతలను చేపట్టి విజయం కోసం కృషి చేయాలి. గెలిచినవారు మళ్లీ మంత్రులు అవుతారు. ఈ ఫార్ములా అలా సాగుతుంది. నియోజకవర్గంలో ప్రతి నాయకుడు ప్రజల వద్దకు వెళ్లాలి. సర్వేలో ఏ నాయకుడైనా వెనకబడి వున్నాడని తెలిస్తే వారికి సీటు నిరాకరించడానికి ఎంతమాత్రం వెనుకాడబోము అని హెచ్చరించారు జగన్.