గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 3 మార్చి 2022 (17:43 IST)

ఒకేరోజు సీఎం జగన్‌కు రెండు షాకులు, చీట్ అంటూ ఒకరు, ఊ అంటావా... ఊహు అంటావా అంటూ మరొకరు...

రాజకీయాలు ఎల్లవేళలా ఒకేరకంగా వుండవనేందుకు మెల్లమెల్లగా సీఎం జగన్ పైన సొంత నాయకులు చేస్తున్న వ్యాఖ్యలే పట్టి చూపిస్తున్నాయి. ఒకేరోజు సీఎం జగన్ మోహన్ రెడ్డికి రెండు షాకులు తగిలాయి. ఒకటి ఏపీ రాజధాని అమరావతి అంటూ హైకోర్టు చెప్పడమే కాకుండా దానికి సంబంధించిన అభివృద్ధి చర్యలు చకచకా చేయాలంటూ ఆదేశించింది.

 
రెండోది వైసిపి సీనియర్ లీడర్ మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యలు. వాస్తవానికి వైఎస్ కుటుంబానికి వెన్నుదన్నుగా వుండేవారిలో మేకపాటి కుటుంబం ముందువరసలో వుంటుంది. కొద్దిరోజుల క్రితమే మంత్రి మేకపాటి గౌతంరెడ్డి గుండెపోటుతో మరణించారు. ఆ శాఖలను ఇతరులకు కేటాయించే పనిలో వున్నారు సీఎం జగన్.

 
ఐతే ఇపుడు సీనియర్ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రజలను చీట్ చేయొద్దంటూ కామెంట్ చేసారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చూస్తే మంచి నాయకత్వ లక్షణాలు వున్నాయనిపించేదనీ, వాళ్ల నాన్న వైఎస్సార్ లేని లోటు తీరుస్తారని అనుకునేవాడిననీ, అందుకే గత ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగినట్లు చెప్పారు.

మంచి మెజారిటీతో జగన్ మోహన్ రెడ్డిని గెలిపించారనీ, అందువల్ల రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని సూచించినట్లు తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి ఎలా జరిగిందో తెలుసుననీ, ఐతే ఇక్కడ కూడా అభివృద్ధికి అవకాశం వుందన్న మేకపాటి ఆ దిశలో కాకుండా వాడిది లాగేసుకోవడం, వీడిది లాగేసుకోవడం వంటివి చేయకుండా మనం స్వచ్చంగా, పద్ధతిగా వుండాలని చెప్పుకొచ్చారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

 
ఊ అంటావా రెడ్డి.. ఊహూ అంటావా రెడ్డి... కోర్టు తీర్పుకు ఊ అంటావా... RRR
ఊ అంటావా రెడ్డి.. ఊహూ అంటావా రెడ్డి. కోర్టు తీర్పుకు ఊ అంటావా.. ఊహూ అంటావా జగన్ రెడ్డి. రైతులు పోరాడుతున్న గుడారాలను తొలగించి వారి పనులు వారు చేసుకోవాలి. అమరావతిని అభివృద్థి చేయాలి అంటూ సెటైర్లు వేసారు వైసిపి రెబల్ ఎంపి రఘురామ కృష్ణరాజు.

ఇక ఊహూ అనడానికి ప్రభుత్వానికి అవకాశం లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మూడంటే మూడు అన్నారు. బొత్స సత్యనారాయణ కూడా మాట్లాడారు. చాలామంది బుడంకాయలు మాట్లాడారు. ఏం మాట్లాడినా.. ఎంత పెర్ఫార్మెన్స్ చేసినా ఉపయోగం లేదు. అమరావతి దీపం వెలుగుతో మీ అహం దీపం ఆరిపోయింది. మీరు జ్యోతిని ఎంత ఊదినా అది ఆగిపోదు. అలాగే ఉంటుంది. ఇప్పటికైనా మీరు మారండి.. మీలో మార్పు రావాలి. లేకుంటే మీరు బాగా ఇబ్బంది పడతారు.

అమరావతిని అభివృద్థి చేయడం ఇక నుంచి ప్రారంభించండి. రైతులు చేసిన పోరాటాలు చాలు. ఇన్ని రోజులు వారు చేసిన పోరాటాలు పట్టించుకోలేదు. మూడు రాజధానులంటూ ఏవేవో మాట్లాడారు. ఇప్పుడేమంటారంటూ ఎంపి రఘురామ క్రిష్ణమరాజు సూటిగా ప్రశ్నించారు.