1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. JNU violence: Sabarmati hostel warden resigns

జేఎన్‌యూ దాడి ఘటన : హాస్టల్ వార్డెన్ రాజీనామా

JNU violence
ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) ప్రాంగణం ఆదివారం రణరంగంగా మారింది. ముసుగులు ధరించిన కొందరు దుండగులు వర్సిటీలోని సబర్మతి హాస్టల్‌తో పాటు మరికొన్ని హాస్టల్స్‌లోకి ప్రవేశించి కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ దాడుల్లో సుమారు 23 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వర్సిటీ ఆస్తులను ధ్వంసం చేశారు. అడ్డుకున్న ప్రొఫెసర్లపై కూడా దాడులు చేశారు దుండగులు. 
 
అయితే తాము దుండగులను అడ్డుకునేందుకు ప్రయత్నించాం. కానీ హాస్టళ్లకు భద్రత కల్పించలేకపోయామని సబర్మతి హాస్టల్‌ వార్డెన్‌ ఆర్‌. మీనా తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. తాను హాస్టల్‌ వార్డెన్‌ పోస్టుకు రాజీనామా చేస్తున్నట్లు స్టూడెంట్‌ డీన్‌కు ఆమె తెలిపారు. తన రాజీనామా లేఖను యూనివర్సిటీ అధికారులకు పంపారు వార్డెన్‌. 
 
మరోవైపు, ఈ దాడి ఘటనపై ఆ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ఎం. జగదీష్‌ కుమార్‌ స్పందించారు. యూనివర్సిటీలో శాంతియుత వాతావరణానికి విద్యార్థులు సహకరించాలని వీసీ విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. శీతాకాల సెమిస్టర్‌ పరీక్షలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 
 
శీతాకాల సెమిస్టర్‌ పరీక్షలకు ఇబ్బందులు కలిగించేందుకు యూనివర్సిటీ సర్వర్లను కొందరు డ్యామేజ్‌ చేశారని వీసీ తెలిపారు. విద్యార్థులెవరూ ఎలాంటి ఆందోళనలకు గురికావొద్దని చెప్పారు. విద్యార్థులకు రక్షణ కల్పిస్తామన్నారు. అయితే ఈ దాడులకు బాధ్యత వహిస్తూ వీసీ జగదీష్‌ కుమార్‌ తన పదవికి రాజీనామా చేయాలని జేఎన్‌యూ స్టూడెంట్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
కేసుల మాఫీ కోసమే అమరావతి రచ్చ .. కంత్రీ జగన్ వ్యూహమిదే : సీపీఐ నారాయణ