ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 జనవరి 2020 (14:00 IST)

కేసుల మాఫీ కోసమే అమరావతి రచ్చ .. కంత్రీ జగన్ వ్యూహమిదే : సీపీఐ నారాయణ

తనపై ఉన్న అన్ని కేసులను మాఫీ చేయించుకునేందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని మార్పు అంశాన్ని తెరపైకి తెచ్చారని సీపీఐ నేత కె. నారాయణ ఆరోపించారు. రాజధాని అమరావతి కోసం టీడీపీ నేత గద్దె రామ్మోహన్ సోమవారం నుంచి రిలే నిరాహారదీక్షను చేపట్టారు. 
 
ఈ దీక్షకు నారాయణ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ రాజధానిని మార్చే అర్హత సీఎం జగన్‌కు లేదన్నారు. ఒకవేళ రాజధానిని మార్చాలంటే జగన్ మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. 
 
వైసీపీ నేతలకు కావాల్సింది రాజధాని కాదని, విశాఖ సెజ్‌లో వచ్చే లక్షల కోట్లని ఆరోపించారు. అలాగే, విశాఖతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వైకాపా నేతలకు ఉన్న భూములను కోట్లాది రూపాయలకు అమ్ముకోవడమేనని చెప్పారు. 
 
ఇకపోతే, రాజధానిపై జగన్‌కు మూడు ముక్కలాట ఆలోచన ఎందుకు వచ్చిందని నారాయణ ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడేందుకే వైసీపీ నేతలు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. రాజధాని మార్పు వల్ల ఎన్నో నష్టాలు వస్తాయని ఆయన తెలిపారు.
 
రాజధాని మార్పుపై బీజేపీతో సీఎం జగన్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. తనపై ఉన్న కేసులను మాఫీ చేస్తే ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన అమరావతిని మార్చబోనని జగన్ హామీ ఇవ్వొచ్చు అని నారాయణ జోస్యం చెప్పారు. అందుకే జగన్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆయన ఆరోపించారు.