1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Karnataka Bypoll Result 2019: BJP Sweeps Karnataka Bypoll elections

కర్నాటక బైపోల్ : 12 సీట్లలో బీజేపీ గెలుపు.. సీఎం యడ్డి సర్కారు సేఫ్

Karnataka Bypoll Result 2019
కర్నాటక రాష్ట్రంలో 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ 12 చోట్ల విజయభేరీ మోగించింది. మిగిలిన మూడు స్థానాల్లో కాంగ్రెస్ రెండు చోట్ల, స్వతంత్ర అభ్యర్థి ఒక చోట విజయం సాధించాడు. ఈ ఫలితాలతో ముఖ్యమంత్రి యడ్యూరప్ప సర్కారు మెజార్టీ గండం నుంచి బయటపడింది. 
 
ఈ ఉప ఎన్నికల ఫలితాలను కలుపుకుంటే శాసనసభలో బీజేపీ సంఖ్యా బలం 117కు చేరింది. కాంగ్రెస్‌ 68, జేడీ(ఎస్‌) 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం 112. అయితే బీజేపీకి 117 ఎమ్మెల్యేల మద్దతు ఉండటంతో సీఎం యెడియూరప్ప ప్రభుత్వానికి ఇప్పట్లో ఎలాంటి ఢోకా లేదని చెప్పాలి. 
 
ఈ యేడాది జూలైలో 17 మంది ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్, జేడీఎస్‌లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంతో అప్పటి స్పీకర్ రమేశ్ కుమార్ వారిపై అనర్హత వేటు వేసిన విషయం తెల్సిందే. దీంతో కుమారస్వామి సారథ్యంలోని జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ పతనమై.. యడ్యూరప్ప ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి.
 
ఈ ఫలితాలపై ముఖ్యమంత్రి యడ్యూరప్ప స్పందించారు. ఉప ఎన్నికల ఫలితాల్లో 15 స్థానాలకు బీజేపీ 12 స్థానాల్లో గెలవడం తమ పార్టీకి గొప్ప విజయమన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షం తమపై ఆరోపణలు చేయడం మానాలి. ప్రభుత్వానికి సహకరించాలి. రాబోయే మూడున్నరేండ్లు కర్ణాటకలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోందన్నారు. 
 
ఈ ఉప ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలకు మంచి భవిష్యత్‌ ఉంటుందని సీఎం హామీనిచ్చారు. వీరికి ప్రభుత్వంలో ఉన్నత పదవులిచ్చే అంశంపై రెండు, మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో మాట్లాడుతానని సీఎం యడ్యూరప్ప ప్రకటించారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఓ యవతితో నిశ్చితార్థం.. మరో యువతితో పెళ్లి.. వరుడు గుర్రమెక్కుతుండగా...