1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 డిశెంబరు 2019 (16:36 IST)

ఓ యవతితో నిశ్చితార్థం.. మరో యువతితో పెళ్లి.. వరుడు గుర్రమెక్కుతుండగా...

ఇద్దరు యువతులను మోసం చేసి పెళ్లి చేసుకోవాలని భావించిన ఓ వ్యక్తి పాపంపండి పోలీసులకు చిక్కాడు. తిరుపతిలో ఓ యువతితో నిశ్చితార్థం చేసుకుని, కర్నూలులో మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం వరుడు ఇంటి నుంచి పెళ్లి మండపానికి వెళ్లేందుకు గుర్రమెక్కుతుండగా, తిరుపతి యువతికి చెందిన బంధువులు పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. దీంతో అతన్ని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. 
 
కర్నూలులో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే, చిత్తూరు జిల్లాకు చెందిన మోహనకృష్ణ తిరుపతిలోని ఓ బ్యాంకులో పనిచేస్తున్నాడు. నంద్యాలకు చెందిన యువతితో అతడికి పెళ్లి కుదిరింది. ఆదివారం వివాహం జరగాల్సి ఉంది. ఊరేగింపుగా పెళ్లి మండపానికి చేరుకునేందుకు మోహన్‌కృష్ణ గుర్రం ఎక్కుతున్నాడు. సరిగ్గా అప్పుడే అనుకోని సంఘటన జరిగింది. 
 
మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌కు చెందిన కొందరు అక్కడికి చేరుకుని మోహనకృష్ణను పట్టుకుని చితకబాదారు. ఒకరితో నిశ్చితార్థం చేసుకుని మరొకరిని ఎలా పెళ్లాడతావని నిలదీశారు. కట్నకానుకలు తీసుకుని జాతకాలు కలవలేదని ముఖం చాటేయడమేంటని ప్రశ్నించారు. తీసుకున్న కట్నం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో వారి బారి నుంచి తప్పించుకున్న నిందితుడు మండపానికి చేరుకుని పెళ్లి పీటలపై కూర్చున్నాడు. వధువు మెడలో తాళి కట్టబోతుండగా అతడిని వెతుక్కుంటూ వచ్చిన మక్తల్ వాసులు మరోమారు అతడిపై దాడిచేశారు.
 
వరుడు చేసిన మోసం గురించి తెలిసిన వధువు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తామిచ్చిన కట్నకానులు, ఖర్చులు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు పెళ్లి కొడుకును అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకెళ్లారు. కాగా, నిందితుడు మోహన్‌కృష్ణ ఇరు కుటుంబాల నుంచి కట్నకానుకల కింద రూ.12 లక్షల వరకు డబ్బులు, 6 తులాల చొప్పున బంగారం తీసుకున్నట్టు తేలింది. దీంతో అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.