1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Ranga Reddy : Lovers Couple Suicide

పెళ్లికి అంగీకరించని పెద్దలు... ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమజంటలు

Ranga Reddy
రంగారెడ్డి జిల్లాలోని రెండు గ్రామాల్లో విషాదం చోటుచేసుకుంది. వేర్వేరుచోట్ల రెండు ప్రేమ జంటలు ఆత్మహత్య చేసుకున్నాయి. కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించలేదన్న కారణంతో బలవన్మరణానికి పాల్పడ్డాయి. షాబాద్‌ మండలం లింగారెడ్డి గూడలో ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని మనస్తాపం చెందిన యువ జంట చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రామానికి చెందిన పల్లవి (19), ఆశమల్ల మహేందర్‌ (21) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో వారి ప్రేమ విషయం ఇంట్లో తెలిస్తే అంగీకరించరేమోనని తీవ్ర మనస్తాపానికి గురై గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 
మరోవైపు కేశంపేట మండలం తొమ్మిది రేకుల గ్రామంలోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లికి అంగీకరించలేదని మనస్తాపం చెంది గ్రామానికి చెందిన సుశీల (20) అనే యువతి ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

విషయం తెలుసుకున్న ఆమె ప్రియుడు శ్రీరాములు (25) కూడా పొలంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై కోన వెంకటేశ్వర్లు మృతదేహాలకు పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా.. నా మతం మానవత్వం. నా కులం అదే... జగన్