శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 2 డిశెంబరు 2019 (13:59 IST)

వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా.. నా మతం మానవత్వం. నా కులం అదే... జగన్

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా శస్త్ర చికిత్స చేయించుకున్న రోగులకు వైద్యం అనంతరం విశ్రాంతి కాలానికి డబ్బు చెల్లించే వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా పథకాన్ని ఆయన సోమవారం గుంటూరు జనరల్ ఆస్పత్రిలో ప్రారంభించారు. శస్త్రచికిత్స అనంతరం వైద్యులు సూచించిన విశ్రాంతి సమయానికి రోజుకు 225 రుపాయలు లేదా నెలకు గరిష్టంగా 5వేల రూపాయలను ఈ పథకం ద్వారా అందజేస్తారు. 
 
రోగులకు ఈ తరహా చేయూత అందించడం దేశంలో ఇదే ప్రథమం. కుటుంబ పెద్ద జబ్బపడితే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ముఖ‍్యమంత్రి జగన్‌ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల ఏటా నాలుగున్నర లక్షల మంది లబ్ధిపొందుతారని ఓ అంచనా. కాగా నిన్నటినుంచే ఈ పథకం అమల్లోకి వచ్చినా ముఖ్యమంత్రి లాంఛనంగా సోమవారం ప్రారంభించారు. అలాగే ఆరోగ్యశ్రీలో వైద్యం పొందిన రోగులు ముఖ్యమంత్రి చేతులు మీదుగా చెక్కులు అందుకున్నారు. గుంటూరు మెడికల్ కాలేజీ జింఖానా ఆడిటోరియంలో సీఎం జగన్‌ ప్రసంగిస్తున్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ మేనిఫెస్టోను భగవద్గీత, బైబిలు, ఖురాన్‌గా భావిస్తున్నాను. ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటూ ముందుకు సాగిపోతున్నాం. రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. మంచి పరిపాలన ఎక్కడైనా జరుగుతుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. జీర్ణించుకోలేక ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఈ మధ్యకాలంలో నా మతం గురించి, నా కులం గురించి మాట్లాడుతున్నారు. ఇటువంటి మాటలు విన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. నా మతం మానవత్వం. నా కులం మాట నిలబెట్టుకునే కులం. అవాకులు, చెవాకులను పక్కనపెడుతున్నామని చెప్పుకొచ్చారు.