ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 6 ఫిబ్రవరి 2020 (09:07 IST)

ఆంధ్రప్రదేశ్‌లో 18 దిశ పోలీసు స్టేషన్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని, ఈ నెల 7వ తేదిన దిశ పోలీసు స్టేషన్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విచ్చేస్తున్నారని డీజిపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలోని సీఎం కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లును డీజిపీ గౌతమ్ సవాంగ్, వీసీ ఆచార్య మొక్కా జగన్నాధరావు పరిశీలించారు. రాజమహేంద్రవరంలోని దిశ పోలీసు స్టేషన్ ను పరిశీలించిన అనంతరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలోని సభ మందిరాన్ని పరిశీలించారు.

నన్నయ విశ్వవిద్యాలయంలో సీఎం జగన్ కార్యక్రమానికి సంబంధించి చేస్తున్న ఏర్పాట్లు ఒక్కోక్కటిగా పరిశీలించి తగిన సూచనలను తెలియజేసారు. ఈ సందర్భంగా డీజిపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదిగా జరుగుతున్న ఈ దిశ పోలిసు స్టేషన్ల కార్యక్రమం కేవలం పోలీసులకు మాత్రమే కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికి సంబంధించిన విషయమని అన్నారు.

7వ తేది ఉదయం రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన దిశ పోలీసు స్టేషన్ ను సీఎం ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం కన్వేన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరవుతారని చెప్పారు.

దీనిలో దిశ యాప్ ను మరియు దిశ పోలీసు స్టేషన్లుకు సంబంధించిన విధివిధానాలతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తారని అన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసిన పోలీసు అధికారులు, లాయర్లు, సిబ్బంది కి దిశ పోలీసు స్టేషన్లుకు సంబంధించిన శిక్షణ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమం కేవలం పోలీసు శాఖకు మాత్రమే కాదని రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యంగా ప్రతీ మహిళకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని 13 జిల్లాలతో పాటు పోలీసు అర్బన్ జిల్లాల్లో కూడా దిశ పోలీసు స్టేషన్లు ఉంటాయని తెలియజేసారు.

అనంతరం వీసీ ఆచార్య మొక్కా జగన్నాధరావు మాట్లాడుతూ 70శాతం పైగా మహిళలు ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో దిశ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఎంతో ఉపయోగకరమని అన్నారు. తాను బాధ్యతలు స్వీకరించిన నెల రోజుల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశ్వవిద్యాలయానికి రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

పోలీసు శాఖ మరియు నన్నయ విశ్వవిద్యాలయం సంయుక్త సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డీఐజీ ఏ.ఎస్.ఖాన్, రాజమహేద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ షిమోషీ బాజ్.పేయి, అదనపు ఎస్పీ లు లతామాధురి, మురళికృష్ణ, రమణకుమార్, డిఎస్పీలు ఎ.టి.వి.రవికుమార్, శ్రీనివాసరెడ్డి, సిఐ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.