శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (10:16 IST)

ఎనిమిదేళ్లకే 5,642మీ. పర్వతమెక్కిన భువన్‌.. తెలుగు బుడ్డోడి రికార్డ్

Kurnool boy
యూరప్‌ ఖండంలో ఎత్తయిన శిఖరంగా పేరుగాంచిన రష్యాలోని మౌంట్‌ ఎల్బ్రస్‌ పర్వతాన్ని గంధం భువన్‌ అధిరోహించాడు. ఈ నెల 18న 5,642 మీటర్ల ఎత్తయిన ఎల్బ్రన్‌ శిఖరాన్ని అధిరోహించిన అతిపిన్న వయస్కుడైన భారతీయునిగా భువన్‌ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ ఘనత గుజరాత్‌కు చెందిన ధనుశ్రీ మెహతా (9)పేరిట ఉండేది.
 
భువన్‌ మైనార్టీ సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న గంధం చంద్రుడు కుమారుడు కావడం విశేషం. ప్రస్తుతం భువన్‌ మూడో తరగతి చదువుతున్నాడు. శిక్షకులు అందించిన మెళకువలు, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే తాను ఈ రికార్డును సాధించగలిగానని భువన్‌ వెల్లడించాడు.
 
కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, మైనార్టీ సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు కుమారుడైన భవన్‌ ప్రస్తుతం మూడో తరగతి చదువుతున్నాడు. పర్వతారోహణపై అతనికున్న ఆసక్తిని గమనించిన చంద్రుడు.. అనంతపురానికి చెందిన స్పోర్ట్స్‌ కోచ్‌ శంకరయ్య వద్ద శిక్షణ ఇప్పించారు. భువనగిరిలోని ట్రాన్సెండ్‌ ఎడ్వంచర్స్‌ కోచ్‌ శంకరబాబు వద్ద కూడా పర్వతారోహణలో మెళుకువలు నేర్పించాడు. 
 
ఈ నెల 11న భారత్‌ నుంచి భువన్‌ బృందం రష్యా బయల్డేరి వెళ్లింది. 14న 3500 మీటర్లు అధిరోహించిన భువన్‌ సహచరులతో కలిసి రాత్రి అక్కడే బస చేశాడు. 15న వారు 4000 మీటర్ల ఎత్తు వద్ద నిర్దేశించిన శిబిరానికి చేరుకున్నారు. అక్కడ రెండు రోజుల శిక్షణ అనంతరం 18న ఎల్‌బ్రస్‌ పర్వత శిఖరానికి చేరుకున్నారు. ఈ క్రమంలో అతిశీతల వాతావరణం సవాల్‌ విసురుతున్నా.. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగిన భువన్‌ సాహస యాత్ర ను ముగించాడు. 
 
బృందంలోని సభ్యులు పర్వతాన్ని దిగి బేస్‌ క్యాంప్‌కు చే రుకుంటున్నారు. వారంతా ఈ నెల 23న స్వదేశానికి రానున్నారు. ఎల్‌బ్రస్‌ పర్వతాన్ని అధిరోహించిన బృందంలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి కోచ్‌ శంకరయ్య (40), వర్మ (27), కర్ణాటక నుంచి నవీన్‌ మల్లేశ్‌ (32) కూడా ఉన్నారు.