1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 10 జులై 2021 (14:02 IST)

వీర జవాన్ జశ్వంత్ రెడ్డికి కన్నీటి వీడ్కోలు

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ జశ్వంత్ రెడ్డి అంత్యక్రియలు అశృనయనాల మధ్య శనివారం జరిగాయి. ఈ వేడుకలను పూర్తిగా సైనిక లాంఛనాలతో నిర్వహించారు. జశ్వంత్ తండ్రి శ్రీనివాస్ రెడ్డి మృతదేహానికి చితి అంటించారు. 
 
ఈ సందర్భంగా గౌరవ సూచకంగా సైనికులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. జశ్వంత్‌రెడ్డి భౌతికకాయానికి హోంమంత్రి సుచరిత, డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, కలెక్టర్‌, ఎస్పీ నివాళులర్పించారు. అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. 
 
జశ్వంత్ అమర్ రహే అంటూ ఆ ప్రాంతం నినాదాలతో మారుమోగింది. ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన రూ.50 లక్షల సాయాన్ని జవాన్ జశ్వంత్ రెడ్డి కుటుంబసభ్యులకు హోంమంత్రి సుచరిత అందించారు.
 
కాగా, కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా సుందర్ బనీ సెక్టారులో గురువారం(జున్ 8) అర్ధరాత్రి సెన్యానికి, ఉగ్రవాదులు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాదకొత్తపాలెంకు చెందిన తెలుగు జవాను జశ్వంత్ రెడ్డి అమరుడయ్యాడు.