1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (07:44 IST)

62వ రోజుకు అమరావతి ఆందోళన

నవ్యాంధ్ర రాజధాని తరలింపును నిరసిస్తూ రైతులు, రైతు కూలీలు చేస్తున్న ఆందోళనలు, ధర్నాలు సోమవారం 62వ రోజుకు చేరాయి.

ఈరోజు వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు తరలివచ్చి సంఘీభావం తెలనున్నారని నిరసనకారులు తెలిపారు. ఆదివారం మదడం, తుళ్లూరు, తాడికొండ అడ్డరోడ్డు, కృష్ణాయపాలెం, వెలగపూడి, రాయపూడి, యర్రబాలెం, పెదపరిమి తదితర ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వెలగపూడి, మందడంలో అసైన్డ్‌ రైతులు, దళిత కూలీలు, మహిళలు రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు.
 
అజ్మీర్ చేరిన అమరావతి ఆందోళన
సీఎం మనసు మార్చుకొని ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించేలా చూడాలని తుళ్లూరు, రాయపూడి మైనార్టీ రైతులు కుటుంబాలతో కలిసి రాజస్థాన్‌లోని అజ్మీర్‌ దర్గాలో ఆదివారం ప్రార్థనలు నిర్వహించారు. మూడు రాజధానులు వద్దు, అమరావతే ముద్దు అంటూ అక్కడ ప్లకార్డులు ప్రదర్శించారు. అన్నదానం చేశారు.
 
ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు నలుగురు సంఘీభావం తెలిపారు. తాడికొండ, పొన్నెకల్లు, నిడుముక్కల తదితర ప్రాంతాల మహిళలు మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు వాహనదారులకు గులాబీలు ఇచ్చి అమరావతికి మద్దతు కూడగట్టారు.

మందడంలో దీక్షలకు మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ సంఘీభావం తెలిపారు. ఎన్జీవోలు, ఆర్‌టీసీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ట్రేడ్‌ యూనియన్లు, లాయర్ల సంఘాలతో ఉద్యమంలోకి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి వాసులు వసంతనగర్‌ కాలనీలో సమావేశాన్ని నిర్వహించి అమరావతి రైతులకు మద్దతు తెలిపారు. హాజరైన జేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ శ్రీనివా్‌సతోపాటు నిర్వాహకులు హరీశ్‌ రమేశ్‌లను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. దీంతో మద్దతుదారులు నినాదాలతో హోరెత్తించారు. 
 
రైతుల ఉద్యమానికి తమ సహకారం: ప్రొఫెసర్‌ కోదండరాం 
ప్రభుత్వం రైతులను నట్టేట్లో ముంచిపోవటం కరెక్టు కాదని, రాజధాని అమరావతి రైతుల ఉద్యమానికి తమ సహకారం ఉంటుందని తెలంగాణ జన సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. అయితే, తమది పక్క రాష్ట్రం అయినందున.. అమరావతికి దీర్ఘకాలికంగా లాభించే విధంగా మా ట్లాడాల్సి ఉందన్నారు.

అప్పుడే.. రాజధానిలో రైతులు చేస్తున్న పోరాటాలకు ఫలితం ఉంటుందని చెప్పా రు. ఓ వివాహ వేడుక కోసం ఆదివారం తెనాలి వెళ్తున్న ప్రొఫెసర్‌ కోదండరాంను రాజధాని ప్రాంత రైతులు, మహిళలు ఓ హోటల్‌లో కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

అమరావతి ఉద్యమానికి తెలంగాణ ప్రజల మద్దతు ఉండేలా చూడాలని కోరగా, కోదండరాం పైవిధంగా స్పందించారు. పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే రాజధానికి భూములు ఇచ్చామని, అయితే, వ్యక్తి మీద ఉన్న కోపాన్ని వ్యవస్థ మీద చూపుతూ తమ బతుకుల్ని అగాధంలోకి నెడుతున్నారని వైసీపీ ప్రభుత్వ తీరుపై ఆక్రోశం వెళ్లగక్కారు.

62 రోజుల నుంచి నిరసనలు వ్యక్తం చేస్తున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదని, 40 మందికి  పైగా రైతులు, రైతుల కూలీలు చనిపోయినా.. ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని రైతులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.