బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (10:08 IST)

సీఎం జగన్ ఆశలు ఆవిరి... సెలెక్ట్ కమిటీకి విపక్షాల పేర్ల జాబితా

పాలన వికేంద్రీకరణ కోసం మూడు రాజధానుల ఏర్పాటు, అమరావతి రైతులతో సీఆర్డీఏ కుదుర్చుకున్న చట్టం రద్దుకు ఏపీ శాసనమండలి ఆమోద ముద్రవేయలేదన్న అక్కసుతో శాసనమండలిని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా సర్కారు తీర్మానం చేసింది. ఈ తీర్మాన్ని కేంద్రానికి పంపంచింది.

మరోవైపు, పాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులను శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపడాన్ని బీజేపీతో పాటు.. పీడీఎఫ్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయని వైకాపా ప్రజాప్రతినిధులు వాధిస్తూ వచ్చారు. కానీ, ఈ రెండు పార్టీలు శాసనమండలి ఛైర్మన్ రాసిన లేఖపై స్పదించి, సెలెక్ట్ కమిటీ కోసం తమ సభ్యుల పేర్లతో కూడిన జాబితాను పంపించింది. దీంతో వైకాపా ఆశలు ఆవిరయ్యాయి. 
 
నిజానికి 150 (స్పీకర్ కాకుండా) మంది సభ్యులున్న వైకాపా సర్కారు శాసనమండలిని రద్దు చేసింది. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇక పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు ఎలాంటి అవరోధాలూ ఉండవని భావించింది. కానీ, అధికార పక్షం ఆశలు ఆవిరయ్యాయి. ఈ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపాలని విచక్షణాధికారం మేరకు నిర్ణయం తీసుకున్న మండలి చైర్మన్‌ ఎం.ఏ.షరీఫ్‌.. సదరు కమిటీల్లో ఉండే సభ్యుల పేర్లు పంపాలని ఆయా పార్టీలకు లేఖలు రాశారు. 
 
అయితే సెలెక్ట్‌ కమిటీకి పంపాలన్న నిర్ణయం తప్పని.. పీడీఎఫ్‌, బీజేపీ సభ్యులు కూడా వ్యతిరేకిస్తున్నారని ఇంతకాలం వైకాపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు వాదిస్తూ వచ్చారు. కానీ ఆ రెండూ సోమవారం ఆయా కమిటీలకు తమ సభ్యుల పేర్లను సూచిస్తూ మండలి ఇన్‌చార్జి కార్యదర్శికి పంపాయి. 
 
పాలన వికేంద్రీకరణ-3 రాజధానులపై బిల్లుపై కమిటీకి కేఎస్‌ లక్ష్మణరావు(పీడీఎఫ్‌), పీవీఎన్‌ మాధవ్‌ (బీజేపీ); సీఆర్‌డీఏ రద్దు బిల్లుపై ఐ.వెంకటేశ్వరరావు (పీడీఎఫ్‌), సోము వీర్రాజు (బీజేపీ) పేర్లను సిఫారసు చేయడంతో అధికార పక్షం ఒంటరిదైపోయింది.
 
అలాగే, ప్రధాన విపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా తమ పార్టీ తరపున పేర్లను ఇచ్చింది. శాసనమండలిలో ఈ పార్టీకి సంపూర్ణ మెజార్టీ ఉంది. దీంతో రెండు బిల్లులపై కమిటీలకు తమ సభ్యుల పేర్లను ఛైర్మన్‌కు సిఫారసు చేసింది. 
 
సీఆర్‌డీఏ రద్దు బిల్లుపై అధ్యయనానికి దీపక్‌రెడ్డి, బచ్చుల అర్జునుడు, బీద రవిచంద్ర, గౌనివారి శ్రీనివాసులు, బుద్దా నాగజగదీశ్వరరావు పేర్లను ప్రతిపాదించింది. అలాగే, పాలన వికేంద్రీకరణ బిల్లుపై అధ్యయనానికి అశోక్‌బాబు, లోకేశ్‌, తిప్పేస్వామి, బీటీనాయుడు, సంధ్యారాణి పేర్లను సిఫారసు చేసింది. 
 
ఈ కమిటీల్లో వైసీపీ పాల్గొనేది లేదని ఇప్పటికే మండలిలో సభానేతలు, డిప్యూటీ సీఎం పిల్లి సుభాశ్‌చంద్రబోస్‌, చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి.. మండలి కార్యదర్శికి లేఖలు రాసిన విషయం తెల్సిందే. ఇపుడు షరీఫ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే.