గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

సీఎం జగన్ షాక్... కాంట్రాక్టు - ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సేవలకు సెలవు

ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ఉద్యోగుల సేవలను నిలిపివేసింది. పదవీ విరమణ చేసినప్పటికీ ఈ ఏడాది మార్చి 31వ తేదీకి ముందు నుంచి సేవలు అందిస్తున్న వారందరినీ తక్షణం తప్పించాలని ఆదేశించింది. అలాగే... మార్చి 31వ తేదీకి ముందు పేపర్‌ నోటిఫికేషన్‌, సంబంధిత నియామక ప్రక్రియ ద్వారా కాకుండా నియమితులైన రూ.40 వేల పైబడి వేతనం తీసుకుంటున్న కాంట్రాక్టు లేదా ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందినీ ఉద్యోగాల నుంచి తొలగించింది. దీనిపై సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం రాత్రి పొద్దుపోయాక జీవో విడుదల చేసింది. 
 
ఈ ఉత్తర్వులు రాష్ట్రస్థాయితో మొదలుకొని జిల్లా, డివిజన్‌, మండల, గ్రామ కార్యాలయాలతోపాటు కార్పొరేషన్లు, అటానమస్‌ సంస్థలకు వర్తిస్తుందని జీవోలో స్పష్టం చేశారు. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, సెక్రటరీలు ఈ నెల 31 లోపు తగు చర్యలు తీసుకుని సంబంధిత నివేదికను సాధారణ పరిపాలనశాఖకు, ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
 
ఈ ఆదేశాలను సకాలంలో అమలు చేయకపోతే సంబంధిత ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఇక ప్యూటీ కార్యదర్శి అంతకంటే ఎక్కువ హోదా ఉన్న అధికారుల్లో ఎవరైనా ఇప్పటికీ ఈ ఏడాది మార్చి 31వ తేదీకి ముందున్న సీటులోనే ఇప్పటికీ ఉంటే... వారి సబ్జెక్టు మార్చడం, లేదా హెడ్‌ క్వార్టర్స్‌లోనే మరో ఆఫీసుకు పంపడం చేయాలని తెలిపారు. మూల వేతనం రూ.56,780 కంటే ఎక్కువ ఉన్న వారందరికీ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.