1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 19 మే 2023 (08:41 IST)

నేడు సీబీఐ ఎదుట వైకాపా ఎంపీ అవినాశ్ రెడ్డి - అరెస్టు తప్పదా?

YS Avinash Reddy
ఏపీ సీఎం, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప సిట్టింగ్ వైకాపా ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్ నగరంలోని సీబీఐ అధికారుల ఎదుట హాజరుకానున్నారు. ఇదే విషయంపై అవినాష్ రెడ్డికి సీబీఐ ఇప్పటికే నోటీసులు జారీచేసింది. 
 
వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి అరెస్టు తప్పదని సీబీఐ అధికారులు ఇప్పటికే తెలంగాణ హైకోర్టుకు తెలిపిన నేపథ్యంలో అవినాశ్ విచారణ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి, మంగళవారమే సీబీఐ అధికారుల ఎదుట విచారణకు ఆయన హాజరుకావాల్సి ఉంది. అయితే, తనకు ముందస్తు షెడ్యూల్‌లో భాగంగా ఇతర కార్యక్రమాలు ఉన్నాయని, నాలుగు రోజులు గడువు కావాలంటూ చివరి నిమిషంలో అవి నాశ్ విచారణకు డుమ్మాకొట్టారు.
 
ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటూనే, శుక్రవారం ఖచ్చితంగా విచారణకు హాజరుకావాలని సీబీఐ అధికారులు నోటీసులు జారీచేశారు. పులివెందులలోని ఆయన ఇంటికి వెళ్లి, అక్కడున్న వారికి నోటీసు ప్రతులు అందజేశారు. ఓ వైపు ముందస్తు షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరుకాలేనని చెప్పిన అవినాశ్ రెడ్డి, ఆ మరుసటి రోజే సీబీఐ విచారణ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
 
'నా పిటిషన్‌ను హైకోర్టు వాయిదా వేసింది. ఇంతలోనే సీబీఐ నన్ను విచారణకు పిలిచింది. సీబీఐ విచారణ నుంచి నాకు రక్షణ కల్పించాలి' అని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, అక్కడా ఆయనకు చుక్కెదురైంది. మరోవైపు, వివేకా హత్య కేసు దర్యాప్తు తుదిదశకు చేరుకున్న నేపథ్యంలో సీబీఐ గత కొద్ది రోజులుగా దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం నాటి విచారణ అత్యంత కీలకంగా మారనుంది. సీబీఐ నోటీసుల మేరకు అవినాశ్ రెడ్డి విచారణకు హాజరవుతారా? మరేదైనా కారణంతో గడువు కోరతారా? విచారణకు హాజరైతే పరిస్థితి ఏమిటనేదానిపై ఉత్కంఠ నెలకొంది.