ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 నవంబరు 2021 (08:41 IST)

ఏపీలో బద్వేల్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం

ఏపీలోని బద్వేల్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. వైఎస్సార్‌సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మరణించడంతో క‌డ‌ప‌ జిల్లా బద్వేలు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించిన విషయం తెల్సిందే. 
 
అధికార ప‌క్షం.. ఆన‌వాయితీ సెంటిమెంట్ ప్రకారం వైసీపీ బద్వేలు టికెట్‌ను డాక్టర్ వెంకటసుబ్బయ్య అర్ధాంగి డాక్టర్ దాసరి సుధకు ఇచ్చింది. ప్రధాన ప్రతిప‌క్షం తెలుగు దేశం ఈ ఎన్నిక‌లో పాల్గొన‌డం లేద‌ని స్పష్టం చేసింది. తొలుత పాల్గొనాల‌ని భావించినా సెంటిమెంట్‌, ఆన‌వాయితీని పాటించాల‌ని నిర్ణయం తీసుకొంది.
 
అంతేకాకండా గ‌త ఎన్నిక‌ల్లో ఎక్కువ‌గా ప్రభావం చూపుకున్నా.. ప్రతిప‌క్షంలా ప్రశ్నిస్తామంటూ నిరంతం ప్రజ‌ల్లో ఉండే ప్రయ‌త్నం చేస్తున్న జ‌న‌సేన కూడా పోటీ నుంచి త‌ప్పుకొంది. అయితే ఎన్నిక‌ల్లో రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీ పోటీ చేశాయి. ఏకగ్రీవం అవుతుందనుకున్న బద్వేల్ అసెంబ్లీ ఉపఎన్నిక బీజేపీ పోటీకి దిగడంతో రసవత్తరంగా మారింది. 
 
వరుస విజయాలతో జోష్‌ మీదుకున్న వైసీపీ బద్వేల్‌ గెలుపుపై ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉంది. డిపాజిట్‌ కూడా రాని బీజేపీ తమకు పోటీ కాదంటూ.. గతంలో వచ్చిన మెజార్టీ కంటె రెట్టింపు తెచ్చుకుంటామని ప్రకటించింది. టీడీపీ, జనసేన బరిలో లేకపోవడంతో రెండు పార్టీల ఓటు బ్యాంక్‌తో ఈసారి కాస్తో.. కూస్తో మైలేజ్ పొందవచ్చని బీజేపీ భావించింది. 
 
తిరుపతి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని కొట్టినట్లుగానే బద్వేల్ బైపోల్‌లో కూడా గట్టి దెబ్బ కొట్టాలని వైసీపీ భావించింది. అందుకు తగిన విధంగా నియోజకవర్గ స్థాయిలో పార్టీ అధినాయకత్వంతో విస్తృతస్ధాయి సమావేశాలు నిర్వహించి మెజార్టీపైనే ఫోకస్ పెట్టారు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అభ్యర్ధిని ప్రకటించిన నాటి నుంచి పోలింగ్‌ వరకూ భారీ మెజార్టీ కోసమే పనిచేశారు. 
 
బద్వేలు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,15,292 కాగా… వారిలో పురుషులు 1,07,915 మంది, మహిళలు 1,07,355 మంది, థర్డ్‌ జండర్‌ 22 మంది ఉన్నారు. 2019 ఎన్నికల్లో బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గంలో 77.64 శాతం పోలింగ్‌ శాతం నమోదైంది. అప్పుడు 2,04,618 ఓట్లు ఉండగా 1,58,863 ఓట్లు పోలయ్యాయి.
 
ప్రతి కౌంటింగ్‌ కేంద్రంలో ఒక సూపర్‌వైజర్, అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్‌ ఉంటారు. గరిష్టంగా 12 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 12గంటలకు తుది ఫలితం వెల్లడయ్యే అవకాశముంది. ఇప్పటివరకు సర్వీసు ఓటర్లు, 80 ఏళ్లు పైబడిన, దివ్యాంగుల ఓట్లు మొత్తం 235 పోస్టల్‌ బ్యాలెట్లు వచ్చాయి. ఓట్లు లెక్కించే సమయానికి సర్వీసు ఓటర్ల ఓట్లు అందితే వాటిని కూడా కలిపి లెక్కిస్తారు. 
 
బద్వేల్‌లో కౌంటింగ్‌ ప్రారంభమైంది. మొత్తం నాలుగు హాళ్లలో 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షల 15 వేల 240 మంది. అయితే ఈసారి 1 లక్షా 47 వేల 213 ఓట్లు పోలయ్యాయి. 68.39 శాతం పోలింగ్‌ నమోదైంది. వైసీపీ, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.
 
బద్వేల్ కౌంటింగ్‌ ప్రారంభమైన తొలి మూడు గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. మొత్తం 281 పోలింగ్ కేంద్రాలకు ఒకేచోట కౌంటింగ్‌ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అభ్యర్థుల సమక్షంలోనే స్ట్రాంగ్‌ రూమ్‌లను తెరుస్తామని.. కొన్ని టేబుళ్ళకు రౌండ్ లు పెరిగే అవకాశం ఉందని.. సూపర్ వైజర్, మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో కౌంటింగ్ జరగనుందన్నారు. రౌండ్ వారీగా ఫలితాలను డిస్‌ ప్లే చేస్తామని.. వర్షం వల్ల కౌటింగ్ కు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు.