1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 అక్టోబరు 2021 (13:43 IST)

చంద్రబాబు ఓ ఉగ్రవాది - గంజాయి బిజినెస్‌లో లోకేశ్ : విజయసాయి ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌పై వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబును ఉగ్రవాదితో పోల్చిన విజయసాయి... ఆయన తనయుడు నారా లోకేశ్‌ను గంజాయి వ్యాపారంలో తలమునకలై వున్నారన్నారు. 
 
ఇటీవల చంద్రబాబు తన పార్టీ నేతలతో కలిసి ఢిల్లీ పర్యటనకు వెళ్లి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ కార్యాలయంతో పాటు టీడీపీ నేతల ఇళ్లపై జరిగిన దాడులను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. 
 
ఈ పరిణామాలపై బుధవారం విజయసాయి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్‌ను ఉద్దేశ్యపూర్వకంగానే పట్టాభితో చంద్రబాబు తిట్టించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పట్టాభి మాటలను ప్రజలే వ్యతిరేకిస్తున్నారని, అలాంటప్పుడు చంద్రబాబు ఏ ప్రయోజనం ఆశించి ఢిల్లీకి వచ్చారని, వ్యవస్థలను మేనేజ్ చేయడానికే వచ్చారా? అని నిలదీశారు. 
 
ముఖ్యంగా, చంద్రబాబు ఓ ఉగ్రవాది అంటూ ఘాటు వ్యాఖ్యలు చాశారు. టెర్రరిస్ట్ ముఠా, అసాంఘిక శక్తులకు రారాజు అన్నారు. పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. గత టీడీపీ ప్రభుత్వంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై రాళ్ల దాడి చేసిన వీడియోలను వారికి చూపించారా? అంటూ వ్యాఖ్యానించారు. 
 
ఒకప్పుడు 356 ఆర్టికల్ రద్దు కోరుతూ తీర్మానం చేశారని, ఇప్పుడేమో అదే ఆర్టికల్‌ను ప్రయోగించాలని డిమాండ్ చేస్తున్నారని విమర్శించారు. ఇది చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతానికి నిదర్శనమన్నారు. 
 
ఇకపోతే, ఏపీలో గంజాయి వ్యాపారంలో లోకేశ్ పాత్ర ఉందని, అది ప్రజలకూ తెలుసని ఆరోపించారు. రాష్ట్రంలో డ్రగ్స్ వ్యాపారం చేసిందే చంద్రబాబు, లోకేశ్ అంటూ ఆరోపించారు. చంద్రబాబు హయాంలో గంజాయి సాగుపై నాటి మంత్రి గంటా శ్రీనివాసరావు ఏం చెప్పారో ముందు వినాలని సూచించారు. 
 
ఏపీ పరువును చంద్రబాబు తీస్తున్నారని ఆగ్రహించారు. బాబు సంగతి తెలిసే ప్రధాని, హోం మంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితులేమీ లేవన్నారు. సీఎం జగన్ పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు సీఎంగా జగనే ఉండాలని కోరుకుంటున్నారని  విజయసాయి రెడ్డి జోస్యం చెప్పారు.