1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 అక్టోబరు 2021 (19:20 IST)

నా కుమార్తె, నా భార్యతో నేను బయటకెళ్తే ఇలా అర్థం చేసుకుంటారా?: పట్టాభి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను దూషించిన కేసులో హైకోర్టు నుంచి బెయిల్ పొందిన తర్వాత నుంచి ఎవరికీ కనిపించకుండా పోయిన పట్టాభి.. సడెన్‌గా ఇవాళ టీడీపీ అధికారిక ఖాతాల్లో.. అది కూడా మార్ఫింగ్‌ను తలపించే వీడియోలో ప్రత్యక్షమయ్యారు. 
 
పట్టాభికి ప్రాణహాని ఉందంటూ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్యే హెచ్చరించిన కాసేపటికే టీడీపీ పట్టాభి తాజా వీడియోను విడుదల చేయడం గమనార్హం. పట్టాభి తన ఫ్యామిలో కలిసి మాల్దీవులకు వెళ్లిపోయారని ప్రచారం జరుగుతుండగా, తాను ఎక్కడికి వెళ్లానో చెప్పకుండానే ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో ఆయన పూసగుచ్చినట్లు వివరించారు. వైసీపీ శ్రేణుల దాడితో షాక్‌కు గురైన తన కూతురిని కాపాడుకోడానికే ఏపీ నుంచి దూరంగా వచ్చేశానని పట్టాభి చెప్పారు
 
తాను కుటుంబంతో కలిసి బయటకి వచ్చా.. అతి త్వరలో మళ్లీ నేను వచ్చి నా విధి నేను నిర్వహిస్తానంటూ వీడియోలో పేర్కొన్నారు. తప్పుడు కేసులకు నేను భయపడను అంటూ స్పష్టం చేసిన ఆయన.. నా ఇంటిపై వైసీపీ నేతలు జరిపిన దాడిలో నా కుమార్తె భయబ్రాంతులకు గురైంది.. ఒక తండ్రిగా నా కుమార్తె బాధ్యత నేను నిర్వర్తిస్తా.. నా కుమార్తె, నా భార్యతో నేను బయటకెళ్తే అనేక అర్ధాలు తీస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
నాపై పెట్టిన తప్పుడు కేసులపై న్యాయస్థానాలను ఆశ్రయించనున్నట్టు ఆ వీడియోలో పేర్కొన్న పట్టాభి.. తన ఇంటిపై దాడి, అనంతరం పరిణామాలపై స్పందించారు. పార్టీ జెండాలు బ్యాక్ గ్రౌండ్లో కనపడేలా కూర్చుని వీడియో చేశారు. కష్టకాలంలో తనకు మద్దతుఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.. ఇక, జైలు నుంచి విడుదలైన తర్వాత తొలిసారి స్పందిస్తూ వీడియో విడుదల చేశారు. అయితే, తాను ఎక్కడ ఉన్నాననే విషయాన్ని మాత్రం గోప్యంగానే ఉంచారు పట్టాభి.