1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 అక్టోబరు 2021 (13:15 IST)

గౌరవ ప్రతిష్టలు ఒక్క ముఖ్యమంత్రికేనా? ఏపీ పోలీసులకు హైకోర్టు సూటి ప్రశ్న

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తేరుకోలేని షాకిచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కించపరిచారన్న అభియోగాలపై టీడీపీ నేత పట్టాభిని ఏపీ పోలీసులు అత్యుత్సాహంతో అరెస్టు చేశారు. దీనిపై హైకోర్టు చురకలు అంటించింది. 
 
టీడీపీ నేత పట్టాభిరామ్ అరెస్టు విషయంలో ఎందుకంత అత్యుత్సాహం చూపించారంటూ పోలీసులపై ఏపీ హైకోర్టు నిప్పులు చెరిగింది. చట్టబద్ధ పాలన (రూల్ ఆఫ లా) అంటే ఏపీ పోలీసులకు ఏమాత్రం గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
ఇతర రాజ్యాంగబద్ధ పోస్టుల్లో ఉన్నవారిని దూషించిన వారిపై చర్యలు తీసుకునే విషయంలో లేని ఉత్సాహం.. కేవలం ముఖ్యమంత్రి  విషయంలోనే ఎందుకొచ్చిందని సూటిగా ప్రశ్నించింది. గౌరవ ప్రతిష్ఠలు ఒక్క ముఖ్యమంత్రికే కాదని, అవి ప్రతి ఒక్కరికీ  ఉంటాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చురకలు అంటించింది. 
 
ముఖ్యమంత్రి అయినా, సామాన్యుడైనా సరే.. అందరి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని, ఏపీ పోలీసులకు మాత్రం ఈ విషయం తెలిసినట్టు లేదని పేర్కొంది. ముఖ్యమంత్రి అయినా సరే చట్టం కంటే ఎక్కువ కాదని స్పష్టం చేసింది.
 
పట్టాభి అరెస్టు విషయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, అరెస్టు విషయంలో పరస్పర విరుద్ధమైన, పొంతనలేని వివరాలను రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం ఆత్మహత్యా సదృశం కాదా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. 
 
అరెస్టు చేసే ఉద్దేశం ఉన్నప్పుడు 41ఏ నోటీసు ఎందుకిచ్చారని నిలదీసింది. నోటీసు ఇచ్చిన తర్వాత మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోకుండా అరెస్టు ఎలా చేస్తారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
గతంలో ఆర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు భిన్నంగా పోలీసులు వ్యవహరించారని తప్పుబట్టింది. బెయిలు ఇవ్వొద్దంటూ ఏజీ ఎస్.శ్రీరామ్ చేసిన వాదనలను తోసిపుచ్చిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత.. పట్టాభికి బెయిలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.