1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 26 అక్టోబరు 2021 (14:38 IST)

మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాపై కేసు... చిటికేస్తే నేల‌మ‌ట్టం అన్నందుకే!

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు పై గుంటూరులోని అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ప‌ట్టాభి ఉదంతం అనంత‌రం... అదే త‌ర‌హాలో అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని బోండాపై కేసు పెట్టారు. ఐ.పిసి 153 ఎ, 294 బి,  504, 505, 506 సెక్షన్ల కింద క్రైమ్ నెంబర్ 676 గా కేసు నమోదైంది. 
 
మంగళగిరి లోని టిడిపి కేంద్ర కార్యాలయంపై వైసీపీ మూకల దాడిని నిరసిస్తూ, చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్షా శిబిరంలో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గుంటూరు నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాన్ బెయిలబుల్  సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. టిడిపి కార్యాలయంపై దాడి చేసి విధ్వంసం సృష్టించిన నిందితులపై మాత్రం బెయిలబుల్ కేసులు నమోదు చేసి కేవలం నోటీసులిచ్చి చేతులు దులుపుకుంటున్న పోలీసులు, టిడిపి నేత బోండా ఉమపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశార‌ని టీడీపీ వ‌ర్గాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
 
చంద్రబాబు చిటికేస్తే తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయాన్ని నేలమట్టం చేస్తామని బోండా ఉమామహేశ్వర రావు హెచ్చరించినట్లు మూడు రోజుల క్రితం మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు తో పాటు మరికొందరు వైసీపీ నేతలు అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అనుసరిస్తున్న వైఖరి, పెడుతున్న కేసులు, నమోదు చేస్తున్న సెక్షన్ల పట్ల తెలుగుతమ్ముళ్లు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అయితే ఉమాపై నమోదైన కేసులోని సెక్షన్ల ప్రకారం అవన్నీ ఏడేళ్ళ లోపు శిక్షలు పడేవే కాబట్టి, 41ఎ నోటీసు ఇవ్వదగినదేనని న్యాయ వర్గాలు చెపుతున్నాయి.