1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : శనివారం, 30 అక్టోబరు 2021 (19:42 IST)

ప్రకాశం జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్!

ప్రకాశం జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి త్వరలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పే  యోచనలో ఉన్నట్టు సమాచారం.. ఆయనకు పార్టీలో తగిన ప్రాధాన్యత లభించని కారణంగానే ఈ  నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.

గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఆయన టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఏలూరితో టీడీపీ అధిష్టానం నేతలు మాట్లాడినట్టు తెలుస్తోంది. టీడీపీలోకి వస్తే తగిన ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఏలూరి మాత్రం ప్రస్తుతం వ్యాపార వ్యవహారాల్లో బిజీగా ఉన్నానని.. కొద్దిరోజుల తరువాత మాట్లాడి ఏ విషయం చెబుతానని అన్నట్టు తెలుస్తోంది.

కాగా 2014 లో ఎమ్మెల్యేగానూ, 2017 లో ఎమ్మెల్సీగాను పోటీ చేశారు. 2019 లో కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన ఏలూరి..  ప్రకాశం జిల్లాలో వైసీపీ అభ్యర్థుల విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ తరువాత కూడా పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఏలూరి.. కొంతకాలంగా పార్టీకి సంబంధించిన పోస్టులు పెట్టడం లేదు.

దానికి తోడు పార్టీ తరఫున జరిగే కార్యక్రమాల్లోనూ పాల్గొనడంలేదు.. దీంతో ఏలూరి పార్టీ మారతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే అదనుగా భావించిన టీడీపీ.. ఏలూరితో సంప్రదింపులు జరుపుతోంది. ఒకవేళ అన్నీ కుదిరితే ఆయన దీపావళి తరువాత పార్టీ మారే అవకాశం ఉంది.