1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 3 జులై 2021 (09:46 IST)

కమీషన్లకు కక్కుర్తిపడే ఎదురు చెల్లింపులు: చంద్రబాబు

పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమలలో సేవతో జరుగుతున్న కార్యక్రమాలను వాణిజ్యపరం చేయడం బాధాకరమని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఓ మీడియాలో ప్రచురితమైన వార్తపై ఆయన ట్విటర్‌లో స్పందించారు.
 
‘‘తిరుమలను వివాదాలకు", వివాదాస్పద నిర్ణయాలకు కేంద్రంగా మారుస్తున్నారు. దాని పవిత్రతను దెబ్బ తీస్తున్నారు. గతంలో జాతీయ బ్యాంకులు, స్వచ్ఛంద సంస్థలు... ఆధ్యాత్మిక సేవా దృక్ఫథంతో భక్తులకు ఉచితంగా అనేక సేవలు అందించేవి. దీనివల్ల టీటీడీపై పైసా భారం ఉండేది కాదు. పైగా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొని అనేక మంది భక్తులు స్వామివారి దర్శనాన్ని ఉచితంగా పొందేవారు. 
 
వారిని పక్కకు తప్పించి లడ్డూ వితరణ, కల్యాణ కట్ట, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో దర్శన టిక్కెట్ల స్కానింగ్‌ వంటి సేవలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించడం ఎంతవరకు సబబు? పుణ్య క్షేత్రంలో వ్యాపార బీజాలు నాటుతారా? కమీషన్ల కక్కుర్తి కాకపోతే బ్యాంకులు, శ్రీవారి సేవకుల ద్వారా ఉచితంగా అందుతున్న సేవలను కాదని ఎదురు చెల్లింపులు చేయడం ఏమిటి?’’ అని చంద్రబాబు ట్వీట్‌ చేశారు.
 
ప్రైవేటు టీచర్ల పరిస్థితి దయనీయం...
రాష్ట్రంలో ప్రైవేటు టీచర్ల పరిస్థితి దయనీయంగా ఉందని మరో ట్వీట్‌లో చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు బతకడం కోసం పలుగు పార పట్టి కూలి పనులకు వెళ్లాల్సిన పరిస్థితులు కొన్నిచోట్ల నెలకొన్నాయని చెప్పారు. టీడీపీ సాధన దీక్షలో వీరిని కూడా ఆదుకోవాలని కోరామన్నారు.  అయినా ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. 
 
ఇప్పటికైనా వీరితోపాటు ఈ రకంగా ఉపాధి కోల్పోయిన అన్ని కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.10 వేలు, కరోనా తీవ్రత కొనసాగినంత కాలం నెలకు రూ.7,500 ఇవ్వాలని ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్‌ చేస్తున్నామని చంద్రబాబు ట్వీట్‌ చేశారు.