శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 జనవరి 2020 (15:10 IST)

రాజధాని మార్పు తథ్యం... పరోక్షంగా తేల్చేసిన సీఎం జగన్

రాజధాని మార్పు తథ్యమని నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా వ్యాఖ్యానించారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఇందులో సీఎం జగన్ పాల్గొని ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రాజధాని మార్పు తథ్యమనే ధోరణితో మాట్లాడారు. 
 
గత ప్రభుత్వ హయాంలో అనేక తప్పులు జరిగాయనీ, వీటిని సరిచేసేలా తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. ముఖ్యంగా, తమకు మూడు ప్రాంతాల అభివృద్ధి ముఖ్యమన్నారు. తద్వారా రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండబోతున్నాయనే సంకేతాలను మరోసారి ఇచ్చారు. 
 
ఇటీవల అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండచ్చేమో అంటూ చేసిన వ్యాఖ్యలు వేడిని రాజేసిన సంగతి తెలిసిందే. శనివారం మాట్లాడుతూ, అన్ని ప్రాంతాలకు మేలు చేసేలా తమ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. గత ప్రభుత్వం కొందరికే న్యాయం చేసిందని అన్నారు. 
 
గత తెదేపా ప్రభుత్వం చేసిన అన్యాయాలను సరిదిద్దుతామని చెప్పారు. అన్ని ప్రాంతాలు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేలా చూస్తామని తెలిపారు. అందరి అభివృద్ధి కోసం సరైన నిర్ణయాలను తీసుకుంటూ, పాలన కొనసాగిస్తామని చెప్పారు. దేవుడి దయతో వచ్చిన ఈ పదవిని అందరి అభివృద్ధి కోసం ఉపయోగిస్తామన్నారు.