గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 డిశెంబరు 2019 (16:57 IST)

కోర్టెక్కిన అమరావతి రైతులు.. జనవరి 23న విచారణ

రాజధాని కోసం తమ సొంత భూములను ఇచ్చిన రైతులు న్యాయం కోరుతూ కోర్టుమెట్లెక్కారు. రాజధాని రైతు పరిరక్షణ సమితి ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ, జీఎన్ రావు కమిటి చట్టబద్ధతను తమ పిటిషన్‌లో వారు ప్రశ్నించారు. 
 
ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని, వెంటనే విచారణ చేపట్టాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోరారు. ప్రభుత్వం నుంచి వివరాలు అందలేదని అడ్వకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. తాజాగా నిన్నటి జీవోలో బీసీజీ నివేదికను ప్రభుత్వం ప్రస్తావించింది. బీసీజీ కమిటీని ఎప్పుడు, ఎవరు నియమించారని, నియమ నిబంధనలు చెప్పాలని పిటిషన్‌ తరపు లాయర్ కోరారు. 
 
ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చాక వివరాలు ఇస్తామని ఏజీ హైకోర్టుకు తెలిపారు. జనవరి 21 నాటికి అందరూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. జనవరి 23న విచారణ చేపడతామన్న హైకోర్టు తెలిపింది. అలాగే, ఇప్పటికే అనేక మంది రైతులు వ్యక్తిగతంగా కూడా కోర్టును ఆశ్రయించిన విషయంతెల్సిందే. వీటన్నింటిపై కోర్టు విచారణ జరుపనుంది.