గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 జనవరి 2020 (17:56 IST)

ఒంటికాలిపై వస్తున్నారు.. నాకూ టైమ్ వస్తుంది : చంద్రబాబు

ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గట్టివార్నింగ్ ఇచ్చారు. తనకూ ఓ టైమ్ వస్తుందని, అపుడు తన విశ్వరూపం చూపిస్తానంటూ హెచ్చరించారు. ముఖ్యంగా, గత కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడుపై జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. టార్గెట్ చేస్తున్నారు. 
 
వీటిపై చంద్రబాబు స్పందించారు. సీఎం జగన్ తనపై ఒంటికాలిపై లేస్తున్నాడని, తనకూ టైమ్‌ వస్తుందన్నారు. తప్పులు చేసిన పోలీసులు, అధికారులు ఎప్పటికీ తప్పించుకోలేరని బాబు మరోమారు హెచ్చరించారు. రాజధానికి వెళ్లకుండా అడ్డుకుంటారా.. ప్రజలందరూ ఏకమై పోరాటం చేస్తే జగన్‌ పులివెందుల పారిపోతాడని జోస్యం చెప్పారు. 
 
పోలీసులు లేకుండా సీఎం ఇంటి నుంచి కాలు కూడా బయటపెట్టలేడన్నారు. దుర్మార్గ సీఎంను ఇంటికి పంపేందుకు ప్రజలు పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అమరావతిని కాపాడుకోవాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. అమరావతి రైతుల బాధలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. మనకు తిండి పెట్టేది ఉద్యోగం, అభివృద్ధి.. కులం, మతం కాదన్నారు. 
 
విద్యార్థులకు స్కాలర్‌షిప్పులే ఇవ్వలేడు కానీ అమ్మ ఒడి ఇస్తాడా? ప్రజలు తెలిసో తెలియకో నెత్తిపై కుంపటి పెట్టుకున్నారు. నెత్తిన కుంపటి దించలేరు... తప్పించుకోలేరు. నాడు ఊరూరుకు వచ్చాడు ముద్దులు పెట్టాడు. ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు.. భరించక తప్పదు అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.