శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (18:00 IST)

జగన్ పాలనలో ఆకాశమంత ఎత్తులో అవినీతి : చింతా మోహన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి పాలనలో అకాశమంత ఎత్తులో అవినీతి రాజ్యమేలుతోందని కాంగ్రెస్ సీనయర్ నేత, మాజీ మంత్రి చింతా మోహన్ ఆరోపించారు. ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు పీసీసీ అధ్యక్షుడిగా, రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసిందన్నారు. కానీ, ఆయన మాత్రం కాంగ్రెస్‌ పార్టీ పునాదులను తొలగించి, తన సొంత పలుకుబడిని పెంచుకున్నారని, తన ఇద్దరు బిడ్డలు వేల కోట్లు సంపాదించుకునేలా ఆర్థిక వనరులను సృష్టించారని ఆరోపించారు. 
 
గతంలో ఏ ముఖ్యమంత్రీ ఇలా సొంత ప్రాపకానికి పాల్పడలేదన్నారు. పార్టీ సీనియర్ నేతలైన జేసీ దివాకర్‌ రెడ్డి, ఎంవీ మైసూరా రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి, కాసు కృష్ణారెడ్డిలను రాజకీయంగా దెబ్బతీశారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ పార్టీ తెచ్చిన రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్తు, అందరికీ ఇళ్లు, ఆరోగ్యశ్రీ పథకాలను తన సొంత పథకాలుగా చిత్రీకరించి లబ్ధి పొందారన్నారు. 
 
ఆఖరికి కాంగ్రెస్‌ పార్టీ పునాదులను తొలగించడమే రాజన్న రాజ్యమా అని ప్రశ్నించారు. జగన్‌ పరిపాలనలో అవినీతి ఆకాశం ఎత్తుకు లేచిందని, ప్రతి ఫైల్‌కూ పైసలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. 65 మైన్ల నుంచి నెలనెలా కోట్ల రూపాయలు, ఇసుక నుంచి వందల కోట్ల రూపాయలు, మద్యం నుంచి ఇంకొన్ని వందల కోట్ల రూపాయలు దండుకుటున్నారని ఆరోపించారు. 
 
అంతేకాకుండా, కాంగ్రెస్‌ పార్టీతో పైకొచ్చిన వైఎస్‌ కుటుంబీకులు ఇప్పుడు రాజన్నరాజ్యం పేరుతో చేస్తున్న హడావుడి పిల్ల చేష్టలుగా కన్పిస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి బలహీనత వల్ల ఆఖరికి టీటీడీ కూడా చేయి జారిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇంతటి బలహీనమైన ముఖ్యమంత్రిని తాను ఎప్పుడూ చూడలేదన్నారు. టీటీడీని అదుపులోకి తెచ్చుకోవడానికి ఆర్ఎస్ఎస్, బీజేపీలు కుట్ర చేస్తున్నాయని చింతా మోహన్ ఆరోపించారు.