శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (17:19 IST)

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పోల్ : 13న రెండో విడత ఓటింగ్.. ఏర్పాట్లు పూర్తి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా శనివారం రెండో దశ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశారు. ఈ పోరులో ఎన్నికల పోలింగ్ ఉదయం 6:30 గంటల నుంచి సాయంత్రం 3:30 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, 
 
ఫలితాల వెల్లడి.. అనంతరం ఉపసర్పంచ్ ఎంపిక చేయనున్నారు. ఎన్నికల పర్యవేక్షణకు ఆయా జిల్లాల్లో ఇప్పటికే ఎన్నికల కమిషన్ పరిశీలకులను పంపగా.. పోలింగ్ సిబ్బందికి సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు.
 
కాగా, 13 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లలో 3,328 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 539 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అవ్వగా 2,789 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. సర్పంచ్ పోటీలో 7,510 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 
 
నాలుగు రోజులపాటు అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు. తమ గుర్తులను చూపించి మరీ ప్రచారం చేశారు. బ్యాలెట్ పేపర్లలో అభ్యర్థుల పేర్లు లేకపోవడంతో మొదటి దశలో అనేక ప్రాంతాల్లో ఓటర్లు గందరగోళానికి లోనయ్యారు. 
 
ఈ విషయాన్ని గ్రహించి రెండో దశలో పోటీ చేసే అభ్యర్థులు తమ గుర్తులను ఓటర్ల వద్దకు తీసుకువెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. బ్యాలెట్ పేపర్లలో పేరు ఉండదని.. కేవలం గుర్తును చూసి మాత్రమే ఓటు వేయాలని.. బ్యాలెట్ పత్రంలో వరుస సంఖ్యలో తమ గుర్తు ఎక్కడ ఉందో చూపించి మరీ ఓటర్లను అభ్యర్థించారు.