1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 28 జనవరి 2022 (08:51 IST)

కార్టూన్ల 'బుజ్జాయి' - 'దేవులపల్లి' కుమారుడు అస్తమయం

తన కార్టూన్లతో బుజ్జాయిగా దేశ ప్రజలకు సుపరిచితుడైన దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన గురువారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. బుజ్జాయిగా ఎంతో గుర్తింపు పొందిన ఆయన దేశానికి ఓ సరికొత్త కామిక్ కథలను పరిచయం చేశారు. గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం కథానికను బొమ్మల ద్వారా పాఠకులకు పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కింది. 
 
ఈయన దేవులపల్లి కృష్ణశాస్త్రి కుమారుడు. డంబు పాత్ర సృష్టికర్త కూడా. 91 యేళ్ల వయస్సులో ఆయన చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించిన సుబ్బరాయశాస్త్రికి చిన్నతనం నుంచే చిత్రలేఖనంపై మక్కువ ఉండేది. అదే ఆయన్ను "బుజ్జాయి"గా చరిత్రలో స్థిరస్థాయిగా నిలబడిపోయేలా చేసింది. 
 
ఈయన ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతితో పాటు ఇంగ్లీష్ పత్రికకు ఆరు దశాబ్దాలుగా పని చేశారు. 17 యేళ్ల వయసులోనే బానిస పిల్ల పేరుతో 30 పేజీల బొమ్మల కథా పుస్తకాన్ని ప్రచురించారు. ముఖ్యంగా, గత 1963లో "ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా"లో పంచతంత్రం ఐదేళ్లపాటు ధారావాహికగా ప్రచురితమై జాతీయ స్థాయిలో ఎనలేని పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది. 
 
"డంబు" అనే కార్టూన్ పాత్రను సృష్టించి దాని పేరుతో 1954లో ఆంధ్రప్రభలో సీరియల్ నిర్వహించారు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో వందకు పైగా చిన్నారుల కామిక్స్, కథల పుస్తకాలు ముద్రించారు. గత 1992లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాలబంధు బిరుదుతో సుబ్బరాయశాస్త్రిని సత్కరించింది.