1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 అక్టోబరు 2021 (20:16 IST)

ఎనిమిదేళ్ల బాలుడి దారుణ హత్య.. ఆస్తి కోసం బొప్పాయి తోటలో..?

ఎనిమిదేళ్ల బాలుడు అతికిరాతకంగా హత్యకు గురయ్యాడు. చిత్తూరు జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలం ఎగువ మేకలవారిపాలెంలో ఎనిమిది సంవత్సరాల తేజేశ్.. తన తల్లిదండ్రులు నాగిరెడ్డి, జ్యోతి కువైట్‌లో ఉండటంతో పీలేరులో ఉంటున్న పెద్దమ్మ కల్యాణి దగ్గర ఉండి సెకండ్ క్లాస్ చదువుతున్నాడు. 
 
దసరా సెలవులు కావడంతో తేజేశ్‌ కేవీపల్లి మండలం ఎగువ మేకలవారిపాలెంలో ఉంటున్న అమ్మమ్మ పార్వతమ్మ ఇంటికి వెళ్లాడు. పీలేరు నుంచి అమ్మమ్మతో కలిసి వెళ్లిన చిన్నారి తేజేశ్ ఈ నెల 12న అదృశ్యమయ్యాడు. దీంతో మేనమామ వేణుగోపాల్ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 
ఈ రోజు ఉదయం కొంత మంది పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి బాలుడి కోసం వెతుకుతుండగా ఊరికి కిలోమీటర్ దూరంలో ఉన్న బొప్పాయి తోటలో తేజేశ్ మృతదేహం కనిపించింది. పండగకని ఊరెళ్లిన పిల్లాడు ఇలా చెట్ల మధ్య శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు గుండలవిసేలా విలపిస్తున్నారు.
 
ఆస్తి కోసం బంధువులే బాలుడిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొడుకు మరణ వార్త తెలుసుకున్న తల్లిదండ్రులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. బంధువులే ఆస్తి కోసం ఈ చిన్నారిని చంపేసి ఉంటారని స్థానికులు చర్చించుకుంటున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేపట్టారు.