శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 14 మే 2020 (21:16 IST)

వలస కార్మికులకు ఆహారం, తాగునీరు.. ప్రతి 50 కిలో మీటర్లకు ఒక రిలీఫ్ కేంద్రం

లాక్ డౌన్ కారణంగా విషాదకర పరిస్థితుల నడుమ మండుటెండలో జాతీయ రహదారులపై స్వస్థలాలకు నడిచి వెలుతున్న వలస కార్మికులకు అన్ని విధాల అండగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని రాష్ట్ర కొవిడ్-19 కమాండ్ కంట్రోల్ సెంట్రల్ ఇన్ఛార్జి ఎం.టి.కృష్ణబాబు తెలిపారు.

ప్రతి 50 కిలోమీటర్లకు ఒక రిలీఫ్ కేంద్రం ఏర్పాటు చేసి, వాటి ద్వారా వలస కార్మికులకు తాగునీరు, ఆహారం అందించడంతో పాటు శ్రామిక్ రైళ్లు, బస్సు సౌకర్యాలు వంటి వివరాలు తెలపాలన్నారన్నారు. ఇటీవల పలు శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో వలస కార్మికుల అవస్థలను దృష్టిలో పెట్టుకుని సీఎం ఈ ఆదేశాలు జారీచేసినట్లు గురువారం విడుదల చేసిన ప్రటకటనలో ఆయన తెలిపారు.

సుదూర ప్రాంతాల నుంచి వలస కార్మికులు తమ కుటుంబ సభ్యులతో స్వస్థలాలకు వెలుతుండడంపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారని కృష్ణబాబు తెలిపారు. మండుటెండలో జాతీయ రహదారులుపై నడిచి వెలుతున్న వలస కార్మికుల అవస్థల పట్ల అందరూ ఉదారభావంతో మెలగాలన్నారు. నడిచి వెలుతున్న వలస కార్మికులను గుర్తించి, రిలీప్ కేంద్రాలకు తీసుకెళ్లి ఆహార ప్యాకెట్లు, తాగునీటిని అందించి కౌన్సెలింగ్ నిర్వహించాలని సీఎం చెప్పారన్నారు.

రిలీఫ్ కేంద్రాలను జిల్లా, రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసి...వాటి ద్వారా తాగునీరు, ఆహారం అందించాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు. ప్రతి 50 కిలో మీటర్ల వద్ద రిలీఫ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. దీంతో పాటు వలస కార్మికుల తరలింపునకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్ల గురించి తెలపాలన్నారు.

రిలీఫ్ కేంద్రాల ద్వారా నడిచి వెళ్లే వలస కార్మికులకు శ్రామిక్ రైళ్లలో తగిన  ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వలస కార్మికులను శ్రామిక్ రైళ్లు హాల్టు ఉండే స్టేషన్ వరకూ ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల ద్వారా తరలించాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు. 

స్టేట్ కంట్రోల్ రూమ్ తో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ హర్షవర్దన్ ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ, నడిచి వెళ్లే వలస కార్మికులకు శ్రామిక్ రైళ్లో ప్రాధాన్యత ఇచ్చేలా చూడాలన్నారన్నారు. వలస కార్మికులకు అందించే ఆహారం, తాగునీటి కల్పనకు స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతల సేవలను వినియోగించుకోవాలని సీఎం చెప్పారని కృష్ణబాబు వెల్లడించారు.

ఒకవేళ స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతలు ముందు రాకుంటే, సంబంధిత జిల్లా కలెక్టర్లు అవసరమైన నిధులు మంజూరు చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. ఏపీకి చెందిన వలస కార్మికులు కాలినడక వెలుతుంటే, అటువంటి వారిని గుర్తించి రిలీఫ్ కేంద్రాల్లో ఉంచడం గాని, బస్సుల ద్వారా వారి స్వస్థలాలకు తరలించడంగాని చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఆ ప్రకటనలో రాష్ట్ర కొవిడ్-19 కమాండ్ కంట్రోల్ సెంట్రల్ ఇన్ఛార్జి కృష్ణబాబు తెలిపారు.