శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 12 మే 2020 (20:58 IST)

వలస కార్మికులను వారి స్వంత రాష్ట్రాలకు పంపుతాం: మంత్రి పేర్ని నాని

వలస కార్మి కులు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన వెసులు బాటును ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చిత్తశుద్ధితో అమలుచేస్తున్నట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) స్పష్టం చేశారు.   

మంగళవారం ఆయన తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారానికై వచ్చిన పలువురు నుంచి మంత్రి పేర్ని నాని వినతిపత్రాలు స్వీకరించారు. లాక్ డౌన్  కారణంగా వేరే రాష్ట్రాలలో చిక్కుకుపోయిన  తమ వారిని తీసుకువచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కొందరు మంత్రి పేర్ని నానిని అభ్యర్ధించారు. అలాగే మరికొందరు ఇక్కడి నుంచి వేరే రాష్ట్రాలకు ప్రయాణించేందుకు అవకాశం కల్పించాలని మరి కొందరు మంత్రిని కోరారు. 
 
ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, జార్ఖండ్ రాష్ట్రానికి ఈ నెల 14 వ తేదీన ( గురువారం ) ఒక ప్రత్యేక రైలు ప్రయాణించనుందని తెలిపారు.  ఆ రాష్ట్రానికి వెళ్లేందుకు 48 మంది తమ పేర్లు ఇప్పటికే  నమోదు చేయించుకున్నారని అలాగే, ఎంపికైన వారి పేర్లను పరిశీలించుకోవాలంటే మచిలీపట్నం తహసీల్దారు కార్యాలయంలో  పరిశీలించుకోవచ్చని ఆయన తెలిపారు. 

పొరుగు రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసి వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపేందుకు ప్రభుత్వం కోట్ల రూపాయల  నిధులను రైల్వే శాఖకు చెల్లించినట్టు తెలిపారు. అయితే ఒకే రోజునే  ఎక్కువ రైళ్లను ఆయా రాష్ట్రాలకు పంపడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఒక్కరినీ స్క్రీనింగ్‌ చేయడానికి, ఇతర ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉన్నందున దశలవారిగా వలస కార్మికులను పంపు తున్నట్టు తెలిపారు. రిజిస్ట్రేషన్‌ ప్రకారం తమ వంతు వచ్చేవరకు ఓపికతో వేచి ఉండాలని మంత్రి పేర్ని నాని  విజ్ఞప్తి చేశారు. 
 
రైలు దొరకదనే ఆందోళన వద్దని సూచించారు. ఈ నెలాఖరు వరకు అన్ని రాష్ట్రా లకు ఆంధ్రప్రదేశ్ నుండి వలస కార్మికుల సౌకర్యార్థం  ప్రత్యేక రైళ్లు నడుస్తాయని, వలస కార్మికులకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని తెలిపారు.  వేరే రాష్ట్రాల నుంచి  వచ్చే ప్రతి ఒక్కరికి క్వారంటైన్ తప్పనిసరి అన్నారు, 

అలాగే ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. భౌతిక దూరం అమలు చేయాల్సి ఉన్నందున ప్రతి రైలులో 1200 మంది చొప్పున ప్రతిరోజు 6వేమంది వలసకార్మికులను వారి వారి ప్రాంతాలకు  పంపుతున్నామన్నారు. తమ సొంత ఊర్లకు వెళ్లాలనుకునే వలస కార్మికులు ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకో వాలని సూచించారు. వరుస క్రమంలో రిజిస్జ్రేషన్‌ చేసుకున్న ప్రతి వలస కార్మికుడిని రైళ్లలో పంపుతామని వివరించారు.

లక్నో, పాట్నా, జైపూర్‌, భోపాల్‌, కోల్‌కత, భువనేశ్వర్‌ తదితర నగరాలకు విజయవాడ  నుంచి రైళ్లు నడుపుతున్నామన్నారు.  కోవిడ్‌-19 నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు, తమ సొంత ఊర్లలో ఉన్న పరిస్థితుల గురించి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలసకార్మికులకు కల్పిస్తున్న సదుపాయాల గురించి ముందస్తుగా తెలుసుకోవాలని సూచించారు.  
 
సొంత రాష్ట్రాలకు వెళ్లే రైళ్లలో అవకాశం వచ్చేంత వరకు తమ తమ పనుల్లో నిమగ్నం కావాలని సూచించారు. కరోనా వైరస్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ముఖ్యమంత్రి సహాయనిధికి  తమవంతు సహాయంగా మచిలీపట్నం 17 వ డివిజన్  సర్కిల్ పేట 1 వ సచివాలయంకు చెందిన వార్డు వాలింటరీలు భూపతి కావ్య , భూపతి సాయినాధ్ సోదరీ సోదరమణులు తమ జీతంలో సగం మొత్తం 5 వేల రూపాయలను మంత్రి పేర్ని నానికి  అందజేశారు.

చిన్నవయస్సులో నలుగురికి తమ డబ్బు ఉపయోగపడాలని యోచన కలగడం ఎంతో మంచి సత్ గుణమని ఆ భగవంతుడు మిమ్మలిని తప్పక దీవిస్తారని మంత్రి వారిని ఆశీర్వదించారు. ఇటీవల అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా ఎంపికైన సి హెచ్ ఫణేశ్వరరావు మంత్రి పేర్ని నానిను మర్యాదపూర్వకంగా కలసి ఒక  బోన్సాయ్ పూలమొక్క కుండీని బహుకరించారు. 

మచిలీపట్నం  రాజుపేట గోరీల దిబ్బ ప్రాంతంలో తాగునీళ్లు సరిగా రావని, ఎప్పటి నుంచో ఆ ప్రాంతానికి ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారని, ఇపుడు కుళాయిలు బాగానే వస్తున్నాయని ట్యాంకర్లు అర్ధాంతరంగా  నిలిపివేశారని స్థానికులు మంత్రి పేర్ని నానికి పిర్యాదు చేశారు.  స్థానిక నవీన్ మిట్టల్ కాలనీకి చెందిన దొంగరి సీత అనే మహిళ తమ ప్రాంతానికి ఒక విద్యుత స్థంభం మంజూరు చేయాల్సిందిగా మంత్రి పేర్ని నానిను కోరారు. 

తనను 6 నెలల క్రితం  ఉద్యోగం నుంచి తొలగించారని దీంతో  తాను ఆర్ధికంగా ఎంతో ఇబ్బందులు పడుతున్నానని జలసత్వపు వెంకటేశ్వరరావు అనే మునిసిపల్ పారిశుధ్యపు ఉద్యోగి మంత్రికి విన్నవించుకున్నారు.