1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 27 సెప్టెంబరు 2019 (07:23 IST)

గుత్తిలో కప్పల వాన!

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు అనంతపురం జిల్లావాసుల్లో ఆనందాన్ని నింపాయి. పదేళ్లలో ఎన్నడూ లేని వర్షపాతం నమోదవడంతో కరువు తీరిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కర్నూలు, కడప జిల్లాల్లోను కురిసిన వర్షాలకు కోన ఉప్పలపాడుకు వరద పోటెత్తింది. ఇక్కడి జలపాతాన్ని చూడడానికి పర్యాటకులు క్యూ కడుతున్నారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ప్రమాదాలు జరక్కుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.
 
అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గుత్తిలో  కుప్పలు, కుప్పలుగా కప్పలు పడ్డాయి. స్థానికులు వీటిని వింతగా చూస్తున్నారు.
 
యాడికి మండలం ప్రజలు కుండపోత వర్షాలతో ఇబ్బందులు పడుతున్నారు. 40 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా వర్షం నమోదు కావటంతో పిన్నేపల్లి చెరువుకు గండి పడింది. దీంతో యాడికిలోని చౌడేశ్వరి కాలనీ, టీచర్స్ కాలనీ, హస్పిటల్ కాలనీ, చెన్నకేశవ కాలనీలు జలమయం అయ్యాయి.

ప్రజలు ఇబ్బందులు పడుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం స్పందించటం లేదు. డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
 
పుట్టపర్తిలో భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని రోడ్లన్ని జలమయం అయ్యాయి. మొన్నటి వరకు తేలికపాటి వర్షాలు కురిసినా..నిన్న భారీ వర్షం కురియటంతో చెరువుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.
 
ఇక సుంకేసుల రిజర్వాయర్‌ కు వరద తాకిడి పెరిగింది. జలాశయం పూర్తిగా నిండిపోయింది. ఇంకా 90 వేల క్యూసెక్కులు వస్తుండడంతో అధికారులు 14 గేట్లు ఎత్తి నీటిని దిగువన శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. అటు తుంగభద్రకు వరద ఉధృతి పెరిగింది.

సుంకేసులతో పాటు తుంగభద్ర నుంచి వరద భారీగా వస్తుండడంతో శ్రీశైలం నిండుకుండలా మారింది. ఈ ప్రాజెక్ట్‌ గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. అధికారులు జల విద్యుత్‌ కొనసాగిస్తున్నారు. సాగునీటి కాల్వలకు 80 వేల క్యుసెక్కులను విడుదల చేస్తున్నారు.