శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: బుధవారం, 5 మే 2021 (17:36 IST)

ఏపీలో త్వరలోనే పూర్తి స్థాయి లాక్ డౌన్ ?

రాష్ట్రంలో రోజు రోజుకి కరోనా తీవ్రత పెరుగుతుండడం, రోజూ వేలల్లో కరోనా కేసులు నమోదు అవుతుండడం అలాగే మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కారు.

నేటి నుండి కిరాణా షాపులకు, ప్రజల నిత్య అవసరాల కోసం, ప్రజల రోజువారీ కార్యక్రమాల నిమిత్తం మధ్యాహ్నం 12 వరకు అనుమతిని ఇచ్చింది. అనంతరం 12 తర్వాత కర్ఫ్యూ కొనసాగుతుందని ఆదేశాలు జారీచేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు ప్రజలు 12 తర్వాత రోడ్లపైకి రాకూడదని నిబంధనలు విధించారు. మరో వైపు పోలీసు అధికారులు సైతం ప్రజా రక్షణ కొరకు 12 తర్వాత కర్ఫ్యూ సక్రమంగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.
 
అయితే నరసరావుపేట ,రొంపిచర్ల మండలాలలో మాత్రం ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకే ప్రజల నిత్య అవసరాల కోసం, వ్యాపారాలు, ఇతర పనులకు అనుమతిస్తున్నారు. అనంతరం ఉదయం 8 నుండి రోజంతా పూర్తిగా  కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.

రొంపిచర్ల, నరసరావుపేట మండలాలలోని పలు గ్రామాల్లో కరోనా కేసులు విపరీతంగా నమోదువుతుండడం, కరోనా మరణాలు కూడా పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి అధికారులు ఇలా కర్ఫ్యూ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎస్‌ఐ పి.హజరత్తయ్య ఆధ్వర్యంలో ఈ కర్ఫ్యూ సరిగ్గా జరిగేలా 8 తర్వాత ఎవరూ రోడ్లపై కనపడకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
 
ఇదిలా ఉండగా రానున్న రోజుల్లో రాష్ట్రమంతా ఇదే తరహాలో కర్ఫ్యూ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న కరోనా విజృంభణకు కళ్లెం వేసే దిశలో ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఒక్కసారిగా లాక్ డౌన్ అంటే ప్రజలు ఇబ్బంది, కంగారు పడతారని కొద్ది రోజులు కర్ఫ్యూ విధించి ఆ తర్వాత పూర్తి స్థాయి లాక్ డౌన్ ను అమలులోకి తీసుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

కరోనా తీవ్రత తగ్గించి  ప్రజల్ని  కాపాడాలంటే లాక్ డౌన్ తప్పనిసరి అని  ఆరోగ్యనిపుణులు సూచిస్తున్న తరుణంలో ఈ నిర్ణయం ప్రభుత్వం త్వరలో తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఏమౌతుందో చూడాలి.