శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 నవంబరు 2021 (09:26 IST)

వాయుగుండం గుప్పెట్లో ఆంధ్రప్రదేశ్ - నేడు రేపు భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరోమారు భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రంలో శనివారం ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఈ నెల 15 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 
 
వాస్తవానికి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా వాయుగుండం ప్రభావం కారణంగా విస్తారంగా వర్షాలు కురవచ్చని తెలిపింది. 
 
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ నెల 18 నాటికి రాష్ట్ర తీరానికి చేరే అవకాశం ఉందని పేర్కొన్న వాతావరణ అధికారులు.. అది ఎప్పుడు, ఎక్కడ తీరం దాటుతుందన్న దాంట్లో స్పష్టత లేదన్నారు. 
 
ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఆవరించిన ఉపరితల ఆవర్తనం, అక్కడి నుంచి గంగా పరివాహక ప్రాంతం పశ్చిమ బంగా వరకు ద్రోణి ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నిన్న కూడా పలుచోట్ల చెదురుమదురు వానలు కురిశాయి.