శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (12:31 IST)

సంగారెడ్డి జిల్లాలో దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీం ప్లాంట్

దేశంలోనే అతి పెద్ద ఐస్ క్రీం తయారీ ప్లాంట్​ సంగారెడ్డి జిల్లాలోని గోవింద్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటవుతోందని, అక్టోబర్​ నాటికి ప్లాంట్​ నిర్మాణం పూర్తవుతుందని మంత్రి కేటీఆర్​ వెల్లడించారు. దీన్ని హట్సన్ అగ్రో ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేస్తోందన్నారు. నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. హట్సన్​ సంస్థ రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఇప్పటికే రూ. 207 కోట్ల పెట్టుబడులను పెట్టిందని తెలిపారు. 
 
ప్లాంట్​ ఏర్పాటుతో స్థానికంగా ఉండే సుమారు 4 వేల మంది డెయిరీ రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని, అదేవిధంగా 500 మందికి కొత్త ఉద్యోగాలు వస్తాయని ఆయన చెప్పారు. రోజూ 100 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్ సిద్ధమవుతోందని వెల్లడించారు. అక్టోబర్ నాటికి ప్లాంట్ నిర్మాణం  పూర్తవుతుందని, ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపారు. 
 
పరిశ్రమలు, ఐటీ శాఖపై బుధవారం ఆయన ఎంసీఆర్​హెచ్చార్డీ సెంటర్​లో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరీంనగర్​లో నిర్మించిన ఐటీ టవర్‌‌‌‌‌‌‌‌ను ఈ నెల 18న ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మంలోనూ ఐటీ భవనాల నిర్మాణం వేగంగా కొనసాగుతోందన్నారు. త్వరలోనే టీ వర్క్, రెండో దశ టీ హబ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. 
 
రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమలను తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయన్నారు. రాష్ట్రానికి కొత్తగా వచ్చే కంపెనీలకు పూర్తి సహకారం అందిస్తామని మంత్రి తెలిపారు. బుగ్గపాడు, బండమైలారం, బండ తిమ్మాపూర్‌‌‌‌‌‌‌‌ వంటి పారిశ్రామిక పార్కుల్లో పెట్టుబడులపై అధికారిక ప్రకటన చేసేందుకు పలు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయన్నారు. 
 
వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్క్‌‌‌‌‌‌‌‌పై మరిన్ని కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని చెప్పారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్​ రంజన్, పరిశ్రమ శాఖ కమిషనర్ మాణిక్ రాజ్, టెక్స్ టైల్స్ డైరెక్టర్ శైలజా రామయ్యర్, టీఎస్ ఐఐసీ ఎండీ వెంకట నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.