1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 28 జనవరి 2020 (07:34 IST)

కర్నూలులో వినూత్న ధర్నా.. చెంబులు పట్టుకొని నిరసన

కర్నూలు ఎం.డి.ఓ ను తక్షణమే సస్పెండ్ చేయాలని యస్సీ, యస్టీ, బిసీ , మైనార్టీ  మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి డిమాండ్ చేశారు.

స్థానిక కలెక్టర్ కార్యాలయం ముందు యస్సీ, యస్టీ , బిసీ, మైనార్టీ మహిళా ఐక్య వేదిక ఆధ్వర్యంలో గార్గేయపురం గ్రామ మహిళలు మరుగుదొడ్ల సమస్య పరిష్కరించాలని  దొడ్డి చెంబులు పట్టుకొని నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుని 24 గంటలు కూడా కాకముందే మహిళలు మరుగుదొడ్ల సమస్య పరిష్కరించాలంటూ చెంబులు పట్టుకుని నిరసన ధర్నా చేయడం అధికారుల వైఫల్యాలకు నిదర్శనం అని ఆమె అన్నారు.

మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన మరుగుదొడ్ల సమస్యపై గార్గేయపురం గ్రామ మహిళలు గ్రామ సెక్రటరీ మరియు కర్నూలు మండల ఎం.డి. ఓ ను కలిసి సమస్యను వివరించగా మాకు సంబంధం లేదని నిర్లక్ష్యం వహించిన ఆ అధికారుల తీరు క్షమించరానిదని ఆమె అన్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పక్క స్వచ్ఛభారత్ అంటూ మరోపక్క మహిళల ఆత్మగౌరవ సమస్య అయినా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని ప్రచారం చేస్తూ ఉంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని ఆమె అన్నారు.

గార్గేయపురం గ్రామ బ్రాహ్మణ వీధి మహిళల మరుగుదొడ్ల సమస్యపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆమె కోరారు.

ఈ కార్యక్రమంలో నంది విజయలక్ష్మి ,మాబ్బీ గ్రామ మహిళలు లక్ష్మి , భారతి, పార్వతమ్మ తదితర మహిళలు పాల్గొన్నారు .ధర్నా అనంతరం స్పందనలో వున్న డి.ఆర్. ఓ.కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.