గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 ఏప్రియల్ 2020 (18:13 IST)

అంట్లుతోమడం - వంట చేసే వీడియోలు కాదు.. రైతుల కష్టాలను చూడండి..

కరోనా వైరస్ కట్టడి కోసం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. దీంతో ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్ళకే పరిమితమయ్యారు. ఈ ఖాళీ సమయంలో సెలెబ్రిటీలు ఇంట్లో వంట పనులు, వంట చేస్తూ, చెట్లకు నీళ్లుపోస్తూ ఇలా వివిధ రకాల వీడియోలను షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలపై కడప జిల్లా పుల్లంపేటకు చెందిన వెంకటప్రసాద్ అనే ఓ రైతు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆ రైతు యూట్యూబ్‌లో ఓ వీడియోను షేర్ చేశాడు. 
 
సెలబ్రెటీలు ఇంట్లోపనులు చేసినవి చూపించేకంటే.. రైతులు తోటల్లో పడే కష్టాలను మీడియా వెలుగులోకి తీసుకురావాలని ఆయన సోషల్ మీడియాతో పాటు మీడియాకు విజ్ఞప్తి చేశాడు. ఇప్పటివరకు ప్రభుత్వం రైతుకు చేసిందేమీలేదని.. 'రైతే రాజు' అంటూ ఒకే మాట చెబుతోందని, అంతకుమించి ఏమీ చేయడంలేదని విమర్శించారు.
 
లాక్‌డౌన్ కారణంగా రైతులు పడుతున్న కష్టాలు, ఇబ్బందులను మీడియా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని వెంకటప్రసాద్ విజ్ఞప్తి చేశారు. తాను రూ.10 లక్షలు ఖర్చుపెట్టి అరటి తోట వేశానని చేతికందిన పంటను అమ్ముకోలేక, ఆకాల వర్షాలు, గాలులకు పంట అంతా నేలపాలైందని వాపోయారు. 
 
పొలాల్లో రైతులు పడే కష్టాలను ఏ ఒక్క మీడియా అయినా సోషల్ మీడియా ద్వారా  వెలుగులోకి తెచ్చిందా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలన్నారు. రైతుకు చాలా ద్రోహం చేస్తున్నామన్న విషయం ప్రభుత్వం గ్రహించాలన్నారు. అన్నీ ముఖ్యమంత్రి చూడలేరన్నారు. 
 
మండల అధికారులు పై అధికారులకు అబద్దాలు చెప్పి, ఆపై అధికారులు మంత్రికి అబద్దం చెప్పి.. మంత్రి సీఎంకు అబద్దం చెబుతారని అన్నారు. రైతు అనేవాడు రాజే కాదని, దీనస్థితిలో రైతులు ఉన్నారని వెంకటప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతు కష్టాలను సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజెప్పాలని ఆ రైతు విజ్ఞప్తి చేశారు.