శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (14:20 IST)

వేధిస్తోందనీ అత్తను కడతేర్చిన కోడలు

తనను నిత్యం వేధిస్తూ వచ్చిన అత్తను ఆ ఇంటి కోడలు కడతేర్చింది. ఈ దారుణం కడప జిల్లా రాజంపేట పట్టణంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన  ఈ వివరాలను పరిశీలిస్తే, రాజంపేట పట్టణం ఎర్రబెల్లికి చెందిన సుమిత్రమ్మ (55) అనే మహిళకు కుమారుడు మహీదర్ రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. ఇతనికి వివాహమైంది. కోడలు పేరు శ్వేత. అయితే, గత యేడాది మే 3న సుమిత్రమ్మ దారుణ హత్యకు గురైంది. 
 
శ్వేతను సుమిత్రమ్మ నిత్యం వేధిస్తుండడంతో ఆమె రెండుసార్లు ఆత్మహత్యా యత్నం చేసింది. ఆ సందర్భంలో అత్త పెడుతున్న అగచాట్లు తల్లికి చెప్పి శ్వేత బోరుమనేది. దీంతో సుమిత్రమ్మను చంపేస్తే పీడ విరగడవుతుందని తల్లీ కూతుర్లు భావించారు.
 
అనంతపురం జిల్లా పశ్చిమ నడిమిపల్లిలోని దేవరపల్లి గ్రామానికి చెందిన కిరాయి హంతకులు ఓర్సు నాగరాజు, కొండ్ల వాల్లపల్లికి చెందిన మల్లెల రమేష్, మల్లికార్జునలను సంప్రదించి హత్యకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో వారు మే మూడవ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో సుమిత్రమ్మను దారుణంగా చంపేశారు.
 
ఈ ఘటన స్థానికంగా సంచలనం కాగా శ్వేత, ఆమె తల్లి కూడా అందరిలాగే తమకే సంబంధం లేదన్నట్టు నటించేశారు. పాతకక్షల నేపధ్యంలో ఎవరో తన తల్లిని చంపేసి ఉంటారని భావించిన మహీధర్ రెడ్డి అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకు కూడా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగడం కష్టమైంది.
 
అయినా ఈ కేసును సవాల్‌గా స్వీకరించి వేర్వేరు కోణాల్లో విచారించడంతో కోడలు, వియ్యపురాలే ఈ దారుణానికి ఒడిగట్టారని తేలింది. దీంతో శ్వేత, ఆమె తల్లితోపాటు కిరాయి హంతకులు నాగరాజు, మల్లికార్జున, రమేష్ ను అరెస్టు చేశారు. వారి నుంచి 62 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.