శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 జనవరి 2020 (15:52 IST)

కావాలంటే కడప లేదా పులివెందులలో పెట్టుకో.. చంద్రబాబు ఓ పిచ్చిపని చేశారు...

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న రాజధాని తరలింపు నిర్ణయంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. రాజధాని తరలింపు అంత సులభమైన పనికాదన్నారు. పైగా, రాజధానిని విశాఖపట్టణం తరలిస్తే రాయలసీమ వాసులకు చాలా దూరం అవుతుందని, ఆర్థికంగా కూడా భారం పడుతుందన్నారు. అందువల్ల రాజధాని తరలింపు నిర్ణయం ఉపసంహరించుకోవాలని కోరారు. 
 
ఇదే అంశంపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ, రాజధానిని కావాలంటే కడప లేదా పులివెందులలో పెట్టుకోవాలని జగన్‌ను కోరారు. కాదని రాజధానిని వైజాగ్ తరలిస్తే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం వస్తుందని హెచ్చరించారు. 
 
రాయలసీమకు రాజధాని కాకుండా, హైకోర్టు వస్తే ఏం లాభమని ఆయన ప్రశ్నించారు. మహా అయితే, పది జిరాక్స్ షాపులు వస్తాయన్నారు. అందువల్ల నవ్యాంధ్ర రాజధాని అమరావతే అని చెప్పుకొచ్చారు. అదేసమయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఓ పిచ్చిపని చేశారంటూ మండిపడ్డారు. రాజధాని తాత్కాలికం.. తాత్కాలికం అంటూ ప్రచారం చేశారనీ, అదే ఇపుడు కొంపముంచిందన్నారు. 
 
నిజానికి ప్రపంచ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో రాజధానిని నిర్మించాలన్న ఉద్దేశ్యంతోనే చంద్రబాబు ప్రస్తుతం నిర్మించిన భవనాలను తాత్కాలికమని చెప్పుకొచ్చారన్నారు. అదేసమయంలో ఈ తాత్కాలిక భవనాల్లో రూపాయి ఖర్చు లేకుండా మరో పదేళ్ళపాటు పరిపాలన చేయొచ్చని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.