శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 జనవరి 2020 (12:52 IST)

మాకూ నోరుంది.. మేమూ మాట్లాడగలం.. కానీ మాకు సంస్కారం ఉంది...

రాజధాని కోసం పోరాటం చేస్తున్న రైతులకు తన తల్లి నారా భువనేశ్వరి సంఘీభావం తెలిపారనీ, ఆమెకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. కానీ, వైకాపా నేతలు ఆమెపై లేనిపోని విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. విమర్శలు చేయడం మాకు కూడా తెలుసన్నారు. కానీ, తమకు సంస్కారం ఉందన్నారు. 
 
ఏపీ రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు చేపట్టిన 24 గంటల రిలే నిరాహార దీక్ష ముగిసింది. ఈ దీక్ష ముగింపు కార్యక్రమంలో టీడీపీ నేత నారా లోకేష్ పాల్గొని గద్దెకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక్క అవకాశం ఇవ్వండంటూ ప్రాధేయపడిన జగన్మోహన్ రెడ్డి.. ఇపుడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని మూడు రాజధానుల పేరుతో ఏపీని మూడు ముక్కలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి వైఖరితో పరిశ్రమలన్నీ తెలంగాణకు వెళ్లాయన్నారు. రాజధాని కోసం కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని ఈ సందర్భంగా లోకేష్‌ డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో కూడా ఏ ఒక్క కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే అవకాశాలే లేవని జోస్యం చెప్పారు. అలాగే, ఇకపై ఏ ఒక్క రైతు కూడా ప్రభుత్వానికి భూమి ఇవ్వరన్నారు. 
 
అదేసమయంలో రైతులకు సంఘీభావం తెలిపన మా అమ్మపై వైకాపా నేతలు ఇష్టమొచ్చినట్టు నోరుపారేసుకుంటున్నారు. రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని నా తల్లిని లక్ష్యంగా చేసుకుని అవాకులు చవాకులు అంటున్నారు. నిజానికి వైఎస్. విజయలక్ష్మి, వైఎస్.షర్మిల, వైఎస్ భారతిల గురించి మేం మాట్లాడలేమా? మాకూ నోరుందన్నారు. కానీ, తమకు సంస్కారం ఉందని నారా లోకేశ్ గుర్తుచేశారు.