శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 జనవరి 2020 (19:52 IST)

మీసం మీద చెయ్యేసి చెబుతున్నా... పవన్ నాయుడే : బొండా ఉమ

వైకాపా మంత్రులు, నేతలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు ఓ రేంజ్‌లో మండిపడ్డారు. పవన్ కళ్యాణ్‌పై వైకాపా నేతలు చేసిన వాటికి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. పైగా, మీసం మీద చెయ్యేసి చెబుతున్నా.. పవన్ నాయుడే అని చెబుతున్నా అని సవాల్ విసిరారు. 
 
రాజధాని అమరావతి కోసం సేకరించిన 33 వేల ఎకరాల భూముల్లో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందంటూ వైకాపా నేతలు గురువారం వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేశారు. వీటిని బొండా ఉమామహేశ్వర రావు కొట్టిపారేశారు. 
 
ముఖ్యంగా, పవన్‌ కల్యాణ్‌‌ను చంద్రబాబు దత్తపుత్రుడని వైకాపా ఎమ్మెల్యేలు పదేపదే చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొట్టారు. పవన్.. చంద్రబాబు దత్తపుత్రుడు అయితే.. వైకాపా నేతలైన మీరు జగన్మోహన్ రెడ్డి పెంపుడు కుక్కలా అని మండిపడ్డారు. 
 
పైగా, పవన్‌ కల్యాణ్‌ పేరెత్తే అర్హత, స్థాయి మీకుందా అని ఆయన ప్రశ్నించారు. పెంపుడు కుక్కల్లాగా, పెయిడ్ ఆర్టిస్టుల లాగా ప్రెస్‌మీట్లు పెట్టి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఒకడు పవన్ నాయుడని అంటున్నాడని, మీసం మీద చెయ్యేసి చెబుతున్నానని.. పవన్‌ నాయుడేనని, పవన్ పాలకొల్లు నాయుడని బోండా ఉమ వ్యాఖ్యానించారు. మీకు డౌట్‌గా ఉంటే మీ డీఎన్‌ఏలు చెక్‌ చేయించుకోండని వైసీపీ నేతలపై బోండా ఉమ విమర్శలు చేశారు. 
 
ఇన్‌సైడ్ ట్రేడింగ్ పేరుతో 25 వేల ఎకరాల భూములు కొనుగోలు చేశారని వైకాపా నేతలు ఆరోపించగా, ఇపుడు కేవలం నాలుగు వేల ఎకరాల భూములు మాత్రమే కొనుగోలు చేసినట్టు వెల్లడించారని బొండా ఉమ చెప్పుకొచ్చారు. 
 
అంతేకాకుండా, వైసీపీ నేతల్లో కొందరు చంద్రబాబు అర్థాంగి నారా భువనేశ్వరిపై వ్యాఖ్యలు చేయడాన్ని ఉమ తప్పుబట్టారు. రాజధాని అమరావతిలో మహిళల ఆవేదన చూసి భువనేశ్వరి చలించిపోయారని, అందుకే మద్దతు ఇచ్చారని వెల్లడించారు. కానీ భువనేశ్వరి గురించి కూడా వైసీపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 
 
రాజధానిలో రైతులు చేస్తున్న ఉద్యమాన్ని బలహీనపర్చేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రతిసారి ఓ సామాజిక వర్గం అంటూ ఆరోపణలు చేస్తున్నారని, దమ్ముంటే కులాల లెక్క తీయాలని సవాల్ విసిరారు. కాగా, రాజధాని రైతుల పరిస్థితి చూసి కదిలిపోయిన నారా భువనేశ్వరి తన చేతి గాజులను విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే.