1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 జనవరి 2020 (20:04 IST)

పేదల కడుపులో సున్నం కొడుతున్నారు... జగనన్న వదిలిన బాణం ఎక్కడ?

తెలుగు సినీ హీరోలపై తెదేపా మహిళా నేత, సినీ నటి దివ్యవాణి ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించింది. వారు హీరోలు కాదనీ, జీరోలు అంటూ మండిపడ్డారు. అమరావతి రాజధానిలో రైతులు గత 23 రోజులుగా ఆందోళన చేస్తుంటే హీరోలు ఏం చేస్తున్నారంటూ నిలదీశారు. కనీసం చెవులకు వినిపించకపోయినా.. కళ్ళకు కనిపించడం లేదా అంటూ ఆమె ప్రశ్నించారు. పైగా జగనన్న వదిలిన బాణం ఎక్కడా ఉంటూ వైఎస్.షర్మిలను ప్రశ్నించారు. 
 
ఆందోళన చేస్తున్న రైతులకు ఆమె తన సంఘీభావాన్ని తెలుపుతూ మీడియాతో మాట్లాడారు. సినీ హీరోలు, వైకాపా నేతలు అమరావతి వచ్చేందుకు భయపడుతున్నారన్నారు. వారికి రైతుల ఆందోళన కనిపించడం లేదన్నారు. పైగా, రైతులకు అన్యాయం చేసేలా వైకాపా నేతలు నిర్ణయం తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పేదల కడుపులో సున్నంకొట్టారంటూ మండిపడ్డారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఉన్న కక్షతో కోట్ల మంది ఆంధ్రుల జీవితాలతో జగన్ చెలగాటమాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నా క్యాంటీన్ల మూసివేయడంతో లక్షలాది మంది పేదల కడుపులో సున్నంకొట్టారనీ, ఇపుడు మీ సేవ ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చారని గుర్తుచేశారు. 
 
వైఎస్ విజయమ్మ గారిని, షర్మిల గారిని, భారతి గారిని మేం ఒకటే అడుగుతున్నాం... నాడు ఓట్లు అడగడానికి ఊరూరా తిరిగారే, ఇప్పుడు రైతుల గోడు కనిపించడం లేదా, వాళ్లు భూములిచ్చిన త్యాగాలు గుర్తించకుండా మీ పార్టీ నేతలు వాళ్ల త్యాగాలను అపహాస్యం చేస్తున్నారు. వారికి న్యాయం చేయకపోగా, రైతులంటే పంచెలు కట్టుకునే ఉండాలని అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారు అంటూ దివ్యవాణి మండిపడ్డారు.