శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 జనవరి 2020 (19:34 IST)

సీఎం మూడు ముక్కలాట ఆడుతున్నాడు.. ఇదేమన్నా పేకాటా?

ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి రాజధాని పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నాడనీ, ఇదేమన్నా పేకాట అని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ఏపీ రాజధాని ఏదని ఎవరైనా అడిగితే మూడు పేర్లు చెప్పే పరిస్థితి వస్తుందని, ఎక్కడ ప్రారంభించి, ఎక్కడ ముగించాలో తెలియని అయోమయపరిస్థితి వస్తుందన్నారు. 
 
రాష్ట్రంలో మూడు రాజధానులు ఉన్నాయంటే.. మనం అవమానంగా ఫీలయ్యే పరిస్థితి వస్తుందన్నారు. ఏపీ రాజధాని ఏది అంటే ఏ పేరుతో మొదలు పెట్టాలి.. ఏ పేరుతో ముగించాలి? అని ఆయన ప్రశ్నించారు. రాజధాని అంటే ఏదో ఒక ఆఫీసు కట్టడం కాదని, భవిష్యత్‌ను తీర్చిదిద్దేదే రాజధాని అని అన్నారు. అందుకే ఆనాడు అందరికి సమానమైన దూరంలో ఉంటుందనే ఉద్దేశంతో అమరావతిని రాజధానిగా పెట్టామని చంద్రబాబు స్పష్టంచేశారు.
 
తెలంగాణ వెళితే మా రాజధాని హైదరాబాద్ అని చెప్పుకుంటారని, దేశంలో ఎక్కడికి వెళ్లినా రాజధాని ఏదంటే ఏదో ఒకటే పేరు చెబుతారని, కానీ మన రాష్ట్రంలో మూడు రాజధానులంటున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. రాజధాని మార్చే అధికారం సీఎంకు ఉందా? అంటే అదీ లేదని స్పష్టం చేశారు.
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం రాజధాని నిర్ణయం ఎప్పుడో జరిగిపోయిందన్నారు. 45 రోజుల్లో రాజధానిని నిర్ణయించుకునేందుకు శివరామకృష్ణ కమిటీ వేశారని, అటు ఆరు జిల్లాలు, ఇటు ఆరు జిల్లాల మధ్యన ఉన్న ఏడో జిల్లాలో రాజధాని ఏర్పాటు చేసుకున్నామని వివరించారు. పైగా, అందరికీ సమానమైన దూరంలో ఏపీ రాజధాని ఉందని చెప్పారు. హైకోర్టు కూడా ఇక్కడే కొలువైందన్నారు. 
 
గత చరిత్రను ఓసారి పరికిస్తే, ఒక ముఖ్యమంత్రి రాజధానులు మార్చే అవకాశమే లేదు. స్వాతంత్ర్యం వచ్చాక ఎందరో సీఎంలు వచ్చారు కానీ ఎవరూ రాజధాని మార్చుతామని చెప్పలేదు. అప్పుడెప్పుడో తుగ్లక్ మార్చాడు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినప్పుడు, కొత్త రాష్ట్రాలు విడిపోయినప్పుడే కొత్త రాజధానులు ఏర్పడ్డాయని గుర్తుచేశారు. 
 
కానీ, ప్రస్తుత ముఖ్యమంత్రి ముర్ఖత్వంతో వితండవాదం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని మార్పు కోసం కమిటీల మీద కమిటీలు వేశాడు. రాజధాని అంటే ఏదో ఆఫీసులు పెట్టుకోవడానికి కాదు, యువత భవిష్యత్తు తీర్చిదిద్దే ప్రాంతంగా ఉండాలి. హైదరాబాద్ లాంటి రాజధాని కావాలి. అక్కడ మన శ్రమంతా నష్టపోయామన్నారు. 
 
సింగపూర్‌ వంటి నగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పామని, దీంతో భూములకు విలువ పెరుగుతుందని రైతులు భూములిచ్చారని చంద్రబాబు తెలిపారు. అమరావతిలో దాదాపు రూ.10 వేల కోట్లు ఖర్చుపెట్టామన్నారు. అమరావతిలో ప్రస్తుతం ఉన్న...10 వేల ఎకరాల భూమిని అమ్ముకుంటే డబ్బులు వస్తాయని, దాంతో అభివృద్ధి చేయవచ్చునని చంద్రబాబు సూచించారు. 
 
రాజధాని కోసం చరిత్రలో ఎక్కడా లేనివిధంగా రైతులు రాజధాని కోసం 33 వేల ఎకరాలు త్యాగం చేశారు. ప్రభుత్వం చెప్పిన మాట నమ్మి భూములు ఇచ్చారు. ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అయినప్పుడు, దేనికి లక్ష కోట్లవుతుంది? ఇప్పటికే రాజధానిలో చాలా డిపార్ట్ మెంట్ల ఆఫీసులు కూడా ఏర్పడ్డాయి. అమరావతికి అన్ని అనుకూలతలు ఉన్నాయి. అలాంటి ప్రదేశాన్ని వదిలేసి ఈ సీఎం మూడు ముక్కలాట ఆడుతున్నాడు. ఇదేమన్నా పేకాటా? అభివృద్ధి వికేంద్రీకరణ తెలియదు, అభివృద్ధి చేయడం తెలియదు కానీ మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాడంట! అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు.