1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (10:25 IST)

నీ యవ్వ గీ కర్ణ ఎవడే.. ఊర్లో ఏమంటుంది కర్ణ .. అవ్వతో హరీష్ పరాచకాలు

తెలంగాణ మంత్రివర్గంలో ఉన్న వారిలో టి. హరీష్ రావుకు ప్రత్యేక గుర్తింపు వుంది. పైగా, ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి ఎరుగని నేత. రాష్ట్ర వ్యాప్తంగా మంచి అభిమానగణం కలిగిన వ్యక్తి. పైగా, ప్రజల నాడి బాగా తెలుసిన రాజకీయ నేత. అలాంటి హరీష్ ఇటీవల ఓ అవ్వతో పరాచికాలు ఆడారు. లాక్‌డౌన్ విధుల్లో భాగంగా, ఆయన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ముఖ్యంగా, గ్రామాల్లో పర్యటిస్తూ, అక్కడ పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే అక్కడే ఉండి తక్షణం పరిష్కరిస్తున్నారు. 
 
ఈ పర్యటనలో భాగంగా, ఆయన ఓ అవ్వతోపాటు కొంతమంది మహిళలతో ఓ ఆసక్తికర సంభాషణ సాగించారు. ఓ ముసల్వను ప్రశ్నిస్తూ, ఊర్లో ఏమంటుది కర్ణ, నీ యవ్వ గీ కర్ణ ఎవడే అంటూ ప్రశ్నించారు. అలాగే, ఆయన అక్కడ ఆ గ్రామ మహిళలతో సాగించిన సంభాషణలకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
మరోవైపు, కరోనా మహమ్మారి నుంచి ప్రాణాలను ఫణంగా పెట్టి సైనికుల్లా ప్రజలను కాపాడుతున్న వైద్య, పారిశుద్ధ్య, పోలీసు సిబ్బంది సమాజంలో విలువైన గౌరవాన్ని పొందుతున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. కరోనా నుంచి పునఃర్జన్మ ప్రసాదిస్తున్న ప్రజా సేవకులను ప్రభుత్వం కూడా గుర్తిస్తుందన్నారు. ఈ మూడు శాఖల సిబ్బందికి వందశాతం వేతనంతోపాటు నెలకు రూ.130 కోట్లు ప్రోత్సాహకం ఇస్తున్నట్లు చెప్పారు. 
 
లాక్‌డౌన్‌ వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నా ప్రజల కోసం పనిచేస్తున్న ఈ మూడు శాఖల సిబ్బందికి ప్రోత్సాహకం మాత్రం తప్పక ఇస్తామన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, కార్పొరేషన్ల చైర్మన్లు ప్రతాప్‌రెడ్డి, భూపతిరెడ్డి పాల్గొన్నారు.
 
అలాగే, లాక్‌డౌన్ కారణంగా ఉపాధిని కోల్పోయి నారాయణఖేడ్‌ నుంచి రామాయంపేట మీదుగా 10 మంది కుటుంబీకులు కాలినడకన మధ్యప్రదేశ్‌కు బయలుదేరగా వీరిలో సుష్మిత గర్భిణీ కూడా ఉన్నది. ఈ వలస కూలీలను ఆయన మార్గమధ్యంలో గుర్తించారు. వారిలో సుస్మితకు తక్షణ వైద్య సేవలు అవసరమని గుర్తించిన మంత్రి.. సిద్ధిపేట ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత గురువారం ఆయన ఆస్పత్రికెళ్లి ఆ గర్భిణిని పరామర్శించారు. 
 
ఈ సందర్భంగా ఆమెతో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, 'లాక్‌డౌన్‌ పూర్తయ్యాక నా వాహనం ఇచ్చి మిమ్మల్ని మధ్యప్రదేశ్‌కు పంపిస్తా. అప్పటిదాకా మీకు అన్నం పెట్టి జీవనోపాధి కల్పిస్తా'ని హామీ ఇచ్చారు. లాక్‌డౌన్‌ పూర్తయ్యాక ప్రత్యేక వాహనంలో మధ్యప్రదేశ్‌కు పంపిస్తానని హామీఇచ్చారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తనకు ఫోన్‌ చేయాలని సూచించారు.